న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా భారత క్రికెట్ జట్టు మరో పర్యటన రద్దు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో జింబాబ్వేతో కోహ్లీసేన మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శ్రీలంకతో పాటు జింబాబ్వే పర్యటన కూడా రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా శుక్రవారం ప్రకటించారు. మహమ్మారి వల్ల శ్రీలంకలో టీమిండియా పర్యటించడం సాధ్యం కాదని గురువారం బీసీసీఐ పేర్కొన్న విషయం తెలిసిందే.
'కరోనా ముప్పు కారణంగా భారత జట్టు శ్రీలంక, జింబాబ్వే పర్యటనలకు వెళ్లడం లేదు. షెడ్యూల్ ప్రకారం శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం టీమిండియా శ్రీలంకకు జూన్ 24న ప్రయాణించాల్సి ఉంది. జింబాబ్వేతో ఆగస్టు 22న మూడు వన్డేల సిరీస్ ఆరంభం కావాల్సి ఉంది'' అని షా పేర్కొన్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాతే టీమిండియా శిక్షణ శిబిరం ప్రారంభమవుతందని తెలిపారు. దేశంలోని పరిస్థితులను బీసీసీఐ నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రభుత్వ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుసుకున్న తర్వాత క్రికెట్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభింస్తామని జై షా స్పష్టం చేశారు. జూలై వరకు ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభమయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.
'కర్రోడా'అని పిలిచిన వ్యక్తి నాతో మాట్లాడాడు: సామీ