ఆసియా కప్ షెడ్యూల్..
అనంతరం ఆసియా కప్ రోడ్ మ్యాప్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా ప్రకటించాడు. దీనిలో ఈ టోర్నీ ఎక్కడ జరుగుతుందో ఆ వేదిక పేరును వెల్లడించలేదు. అప్పటికి పీసీబీ చైర్మన్ పదవి నుంచి రమీజ్ రజాను తొలగించేశారు. దీంతో కొత్త చైర్మన్ నజామ్ సేథీ ఇలా ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఏసీసీ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని చాలా గొప్ప పని చేసిందని, కావాలంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ షెడ్యూల్ కూడా ప్రకటించాలని ఎద్దేవా చేశాడు.
జై షాతో మీటింగ్..
ఈ విమర్శలపై వెంటనే స్పందించిన ఏసీసీ.. తాము ఈ షెడ్యూల్ గురించి పీసీబీకి పలు ఈమెయిల్స్ పంపినట్లు వెల్లడించింది. కానీ ఆ క్రికెట్ బోర్డు నుంచి తమకు ఎలాంటి సమాధానం రాలేదని, అందుకే తాము ఈ షెడ్యూల్ ఖరారు చేశామని ఏసీసీ ప్రతినిధులు తేల్చిచెప్పారు. దీంతో కొంత వెనక్కు తగ్గిన నజాం సేథీ.. ఏసీసీ చైర్మన్ జై షాతో సమావేశం అవడానికి అపాయింట్మెంట్ కోరాడు.
అత్యంసర మీటింగ్..
అయితే అతనికి ఏసీసీ ప్రతినిధులను కలిసే అవకాశం దక్కింది. ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నేషనల్ టీ20 లీగ్ సందర్భంగా ఏసీసీ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసేందుకు పీసీబీ చీఫ్ నజాం సేథీ అందర్నీ ఒప్పించారు. దీంతో బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ చైర్మన్ జై షా కూడా బహ్రెయిన్ చేరుకున్నారు. భారత జట్టును పాకిస్తాన్ పంపడం మాత్రం కుదరదంటే కుదరదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.
వేదిక మార్పు గ్యారంటీ..
అదే సమయంలో తాజాగా పెషావర్లో జరిగిన పేలుడు పాకిస్తాన్ స్టాండ్ను కొంత బలహీనం చేసింది. దీంతో హోస్టింగ్ హక్కులను పాకిస్తాన్ వద్దనే ఉంచి, వేదికను మాత్రం శ్రీలంక లేదా యూఏఈకి మార్చాలని ఏసీసీ అధికారులు భావిస్తున్నారట. ఏం జరిగినా సరే పాకిస్తాన్ నుంచి ఆసియా కప్ వేదిక మారడం మాత్రం గ్యారంటీ అని బీసీసీఐ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మాత్రం వేచి చూడక తప్పదు.