ఢాకా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-13 సీజన్లో ఆడటానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఆ దేశ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బంగ్లా బోర్డు నుంచి ముస్తాఫిజుర్కు అనుమతి లభించడంతో ఈ సీజన్లో జరుగనున్న ఐపీఎల్ వేలానికి అతడు అందుబాటులో ఉండనున్నాడు. ఇక డిసెంబర్ 19న జరిగే వేలంలో ముస్తాఫిజుర్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
అభిమానులకు శుభవార్త.. మ్యాచ్కు వర్షం ముప్పులేదు!!
గతేడాది బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో సీజన్-12కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 19న జరిగే వేలంలో ఆరుగురు బంగ్లా ఆటగాళ్లు పాల్గొననున్నారు. ముస్తాఫిజుర్తో పాటు తమీమ్ ఇక్బాల్, మెహిది హసన్, సౌమ్య సర్కార్, మహముదుల్లా, టాస్కిన్ అహ్మద్ వేలంలో పాల్గొంటారు. ఇటీవల ముగిసిన బంగ్లా సిరీస్లో ముస్తాఫిజుర్ కేవలం ఒక వికెట్ మాత్రమే తీసాడు.
తాజాగా బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ అక్రమ్ ఖాన్ మాట్లాడుతూ... 'ముస్తాఫిజుర్ తరచు గాయాల బారిన పడుతున్నాడు. అందుకే అతన్ని ఎక్కువగా క్రికెట్ ఆడనివ్వలేదు. ప్రధానంగా విదేశీ లీగ్ల్లో ఆడకుండా ముస్తాఫిజుర్ను అడ్డుకుంటూ వచ్చాం. అయితే ప్రస్తుతం ముస్తాఫిజుర్ ఎటువంటి గాయాలు కాకుండా క్రికెట్ ఆడుతున్నాడు. అందుకోసమే ఐపీఎల్కు అనుమతి ఇచ్చాం. ఐపీఎల్తో తిరిగి గాడిలో పడతాడని ఆశిస్తున్నాం. అదే మాకు కావలి. ముస్తాఫిజుర్ మాకు చాలా కీలకమైన బౌలర్. మళ్లీ సత్తాచాటుకుని పూర్వ వైభవాన్ని చాటుకుంటాడని భావిస్తున్నా' అని అన్నారు.
ఐపీఎల్-2020 కోసం జరిగే వేలంలో 971 మంది క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఇందులో 713 మంది భారత ఆటగాళ్లు కాగా.. 258 మంది విదేశీయులు. భారత క్రికెటర్లలో 19 మంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా.. 634 మంది ఎప్పుడూ టీమిండియా తరఫున ఆడలేదు. మరో 60 మంది కనీసం ఒక ఐపీఎల్ మ్యాచ్ ఆడినవారున్నారు.
ఈ 971 మంది నుంచి తాము కోరుకుంటున్న ఆటగాళ్ల పేర్లను ఎనిమిది ఫ్రాంచైజీలు డిసెంబర్ 9లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆ జాబితాలో ఉన్న వారికే వేలంలో చోటు దక్కుతుంది. ఐపీఎల్లో ప్రస్తుతం గరిష్టంగా 73 మందిని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 19న కోల్కతాలో వేలం జరగనున్న విషయం తెలిసిందే.