టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత్కు తొలి స్వర్ణం అందించిన స్టార్ షూటర్ అవని లేఖరా.. అదే జోరును కొనసాగించలేకపోయింది. బుధవారం జరిగిన పది మీటర్ల మిక్స్డ్ ఎయిర్ రైఫిల్ ప్రోన్ ఎస్హెచ్1 పోటీల్లో అవని విఫలమైంది. ఆమెతో పాటు సిద్ధార్థ బాబు, దీపక్ కుమార్ సైతం అంచనాలు అందుకోలేకపోయారు. దాంతో బుధవారం భారత్కు ఇప్పటి వరకు ఒక్క పతకమైనా దక్కలేదు. పోటీల ఏడో రోజైన మంగళవారం మూడు మెడల్స్ ఖాతాలో వేసుకున్న మనవాళ్లు.. ఓవరాల్గా పది పతకాలతో విశ్వక్రీడల చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు.
సోమవారం మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాడింగ్ ఎస్హెచ్1 పోటీల్లో 19 ఏళ్ల అవని లేఖరా స్వర్ణం అందుకొన్న సంగతి తెలిసిందే. 249.6 స్కోరు సాధించి ప్రపంచ రికార్డును సమం చేసింది. సరికొత్త ఒలింపిక్ రికార్డు సృష్టించింది. పారాలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా అవని రికార్డు సృష్టించింది. అవని ఫామ్ చూసి ఆమె దేశానికి మరో పతకం అందిస్తుందని అందరూ అంచనా వేసినా.. నిరాశపరిచింది. రైఫిల్ ప్రోన్ పోటీల్లో అవని తనకు అలవాటు లేని విధంగా 27వ స్థానంలో నిలిచింది. కేవలం 629.7 స్కోరు సాధించి మూడో రౌండ్లో వెనుదిరిగింది.
మిగిలిన భారత పారా షూటర్లు సిద్ధార్థ్ బాబు, దీపక్ కుమార్ పురుషుల ఈవెంట్లో మరీ దారుణమైన ప్రదర్శన చేశారు. 625.5 స్కోరుతో సిద్ధార్థ్ 40, 624.9 స్కోరుతో దీపక్ 43వ స్థానంలో నిలిచారు. ఫలితంగా భారత్ మిక్స్డ్ టీం ఈవెంట్లో పతకం సాధించలేకపోయింది. ఇక మహిళల పోటీల్లో జర్మనీకి చెందిన నటాషా హిల్ట్రాప్ స్వర్ణం, కొరియా అథ్లెట్ పార్క్ జిన్హో రజతం, ఉక్రెయిన్ షూటర్ ఇరినా షెట్నిక్ కాంస్యం గెలుచుకున్నారు.
ICC Test Rankings: అగ్రస్థానానికి జో రూట్.. టాప్-5లో రోహిత్ శర్మ! 2017 తర్వాత కోహ్లీ తొలిసారి ఇలా!!
విశ్వక్రీడల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో ఏడు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అథ్లెట్లను ఆదర్శంగా తీసుకొని పారా అథ్లెట్లు కూడా తమదైన శైలిలో విజృంభిస్తున్నారు. సోమవారం పోటీల్లో ఐదు పతకాలతో అదుర్స్ అనిపించిన మనోళ్లు.. మంగళవారం మరో మూడు పతకాలు తెచ్చారు. పురుషుల హై జంప్ (టీ42)లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన మరియప్పన్ తంగవేలు 1.86 మీటర్ల ఎత్తు దూకి రజతం కైవసం చేసుకుంటే.. ఇదే విభాగంలో పోటీపడ్డ మరో భారత అథ్లెట్ శరద్ కుమార్ 1.83 మీటర్లతో కాంస్యం గెలుచుకున్నాడు.
ఇక పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్1 ఈవెంట్లో సింగ్రాజ్ అదానా కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. దీంతో ఈ క్రీడల్లో 10 పతకాలు (2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు) ఖాతాలో వేసుకున్న భారత్.. పట్టికలో 30వ స్థానంలో నిలిచింది. పారాలింపిక్స్ చరిత్రలో టోక్యోకు ముందు భారత్ 12 పతకాలు సాధిస్తే.. ఈ ఒక్క క్రీడల్లోనే మనవాళ్లు పది మెడల్స్ సాధించడం ఇక్కడ విశేషం.