న్యూ జెర్సీ.. ఫస్ట్లుక్
ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా టీమిండియా న్యూ లుక్తో మెరిసిపోనుంది. కొత్త జెర్సీని ధరించబోతోంది. ఈ జెర్సీ ఫస్ట్లుక్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీ) ఆవిష్కరించింది. పాత తరం క్రికెటర్లను గుర్తుకు తీసుకొచ్చేలా ఈ జెర్సీని డిజైన్ చేశారు. ముదురు నీలం రంగు జెర్సీ ఇది. భుజాల వద్ద తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులు వరుసలు ఉంటాయి. ఇదివరకు భారత క్రికెట్ జట్టు ధరించిన జెర్సీని పోలీ ఉంటుంది. దీని మీద ఎంపీఎల్ స్పోర్ట్స్ పేరును ముద్రిస్తారు.
ఎంపీఎల్ స్పాన్సర్షిప్
టీమిండియా ప్లేయర్లకు ఈ కొత్త కిట్లను స్పాన్సర్ చేస్తోంది ఆ సంస్థే. ఎంపీఎల్ స్పోర్ట్స్ సంస్థ యాజమాన్యంతో కిందటి నెలలోనే బీసీసీఐ ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 120 కోట్ల రూపాయలతో పాటు వచ్చే ఆదాయాన్ని పంచుకునేలా బీసీసీఐ-ఎంపీఎల్ స్పోర్ట్స్ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. దీనికి అనుగుణంగా- కొత్త జెర్సీ, కొత్త కిట్లను ఆ సంస్థ సమకూర్చబోతోంది. దీనితో నైక్ స్థానాన్ని ఎంపీఎల్ స్పోర్ట్స్ సంస్థ ఆక్రమించుకున్నట్టయింది. ఇదే సిరీస్లో ఆస్ట్రేలియా జట్టు కూడా కొత్త జెర్సీని ధరించబోతోన్న విషయం తెలిసిందే.
హాట్ హాట్గా ఆసీస్ టూర్..
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా వాడివేడగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మూడు వన్డే ఇంటర్నేషనల్స్, మూడు టీ20లు, నాలుగు టెస్ట్మ్యాచ్లను ఆడబోతోంది కోహ్లీ అండ్ టీమ్. వన్డే మ్యాచ్లతో సిరీస్ ఆరంభం కానుంది. ఈ నెల 27, 29 తేదీల్లో తొలి రెండు వన్డేలను నిర్వహించేలా క్రికెట్ ఆస్ట్రేలియా షెడ్యూల్ చేసింది. ఈ రెండు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహిస్తారు. మూడో వన్డే, తొలి టీ20 మ్యాచ్లు క్యాన్బెర్రాలోని ఓవల్లో జరుగుతాయి. చివరి రెండు టీ20ల కోసం మళ్లీ ఆ రెండు జట్లూ సిడ్నీకే వస్తాయి.
ఇదీ షెడ్యూల్..
తొలి వన్డే: నవంబర్ 27 (సిడ్నీ), రెండో వన్డే: నవంబర్ 29 (సిడ్నీ), మూడో వన్డే: డిసెంబర్ 2 (క్యాన్బెర్రా ), తొలి టీ20: డిసెంబర్ 4 (క్యాన్బెర్రా), రెండో టీ20: డిసెంబర్ 6 (సిడ్నీ), మూడో టీ20: డిసెంబర్ 8 (సిడ్నీ), తొలి టెస్ట్: డిసెంబర్ 17 నుంచి 21 (అడిలైడ్), రెండో టెస్ట్: డిసెంబర్ 26 నుంచి 30 (మెల్బోర్న్), మూడో టెస్ట్: జనవరి 7 నుంచి 11 (సిడ్నీ), నాలుగో టెస్ట్: జనవరి 15 నుంచి 19 (బ్రిస్బేన్).