న్యూ ఢిల్లీ: ఆసియా కప్లో భాగంగా జరగనున్న ఫైనల్ మ్యాచ్లో శుక్రవారం భారత్తో బంగ్లాదేశ్ తలపడనుంది. మరోసారి టైటిల్ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంటే.. తొలిసారి ఆసియకప్ను ముద్దాడాలని బంగ్లా ఆరాటపడుతోంది. అయితే బంగ్లాదేశ్ ఫైనల్కు రావడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. గ్రూప్ దశలో అఫ్గాన్పై ఓడిన బంగ్లా సూపర్4లో భారత్పై పరాజయం పాలైంది.
బలమైన జట్టును ఫైనల్లో ఢీకొంటున్న నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ మొర్తజా మీడియాతో మాట్లాడాడు. 'గాయాల కారణంగా ఒక్కో ఆటగాడిని కోల్పోవడంతో మేం చాలా కష్టాలను ఎదుర్కొన్నాం. ఆ కోణంలో ఆటగాళ్లు చాలా నేర్చుకున్నారు. యువ ఆటగాళ్లకు ఇది గొప్ప పాఠం. చివరి బంతి వరకూ మా పోరాటం కొనసాగిస్తాం' అని మొర్తజా అన్నాడు.
'షకీబ్, తమీమ్ లాంటి కీలక ఆటగాళ్లు లేకపోయిన మిగతా ఆటగాళ్లు నిరుత్సాహ పడలేదు. తమ పోరాటాన్ని కొనసాగించారు. గ్రూప్ దశలో, సూపర్4 దశలో ఒక్కో మ్యాచ్ను కోల్పోయినప్పటికీ.. పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇప్పటివరకూ మా ఆటతీరుతో మేం గర్వపడ్డాం. అయితే మా భావోద్వేగాలను మేం నియంత్రించుకోవాల్సి ఉంటుంది.'
'ముఖ్యంగా భారత్తో ఫైనల్ మ్యాచ్కు ముందు. టీమిండియా ఎంతో బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్లో ఆ జట్టుతో మేం ఎలా పోరాడతాం అనేదే ఇక్కడ ప్రధానం. ఆసియా కప్లో టీమిండియానే ఫేవరెట్.. అందుకే మేం మానసికంగా బలంగా ఉండి.. చివరి బంతి వరకూ పోరాడాలి' అని బంగ్లా కెప్టెన్ పేర్కొన్నాడు. గాయాల కారణంగా బంగ్లాదేశ్ తమీమ్ ఇక్బాల్, షకీబ్ అల్ హసన్లను కోల్పోయిన విషయం తెలిసిందే.