హైదరాబాద్: న్యూజిలాండ్తో నవంబర్ 1వ తేదీన న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే టీ20 మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని ఆశిష్ నెహ్రా నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెహ్రాపై ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురుస్తోంది.
38 ఏళ్ల వయసులో భారత జట్టులో పునరాగమనం చేసిన నెహ్రాను దిగ్గజ బౌలర్లతో పోలుస్తూ అభిమానులు కొనియాడుతున్నారు. 'నెహ్రాజీ.. నిన్ను మిస్సవుతాం. నీ బౌలింగ్తో పాటు నీ ఎయిర్ ప్లేన్ సెలబ్రేషన్ను' అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.

'40 ఏళ్ల వయసులో జట్టులోకి రావడం చాలా కష్టం. అటువంటిది లేటు వయసులో కూడా జట్టులో చోటు సంపాదించిన నెహ్రా ఇక ఫీల్డ్లో కనిపించడు' అని మరొక అభిమాని ట్వీట్ చేశాడు. 'దిగ్గజ బౌలర్కు బ్యాట్లు సెల్యూట్ చేస్తున్నాయి' అని మరో అభిమాని ట్వీట్ చేశాడు.
కాగా, కివీస్తో నవంబర్ 1వ తేదీన ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే టీ20 మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు నెహ్రా వీడ్కోలు పలకాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాడు. ఈ విషయంపై ఇప్పటికే కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీతో చర్చించినట్లు బీసీసీఐలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చే క్రమంలో తన రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని నెహ్రా భావించి తన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి తెలిపారు. 1999లో మొహమ్మద్ అజహరుద్దీన్ కెప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నెహ్రా, ఇప్పటివరకు భారత్ తరుపున 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్లు ఆడాడు.
టెస్టుల్లో 44 వికెట్లు, వన్డేల్లో 157, టీ20ల్లో 34 వికెట్లు తీశాడు. 2011లో వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కూడా నెహ్రా సభ్యుడిగా ఉన్నాడు. కాగా, క్రికెట్కు నెహ్రా వీడ్కోలు పలకాలనే నెహ్రాపై నిర్ణయంపై ట్విట్టర్లో పలువురు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.