రజనీష్ గుర్బాని
2017-18 రంజీ సీజన్లో విదర్భ జట్టు తరుపున రజనీష్ గుర్బాని అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సీజన్లో రజనీష్ గుర్బాని మొత్తం 6 మ్యాచ్లాడి 39 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసి 2017-18 రంజీ సీజన్లో విదర్భ టైటిల్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. రంజీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ గతేడాది ఐపీఎల్ 2018 వేలంలో రజనీష్ గుర్బానీని ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం విశేషం.
బాబా ఇంద్రజిత్
దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న బాబా అపరాజిత్ సోదరుడే ఈ బాబా ఇంద్రజిత్. గత కొన్ని సంవత్సరాలుగా దేళవాళీ క్రికెట్లో చక్కటి స్ట్రయిక్ రేట్ని సాధించాడు. రంజీల్లో తమిళనాడు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న బాబా ఇంద్రజిత్ అటు రంజీ క్రికెట్లో ఇటు విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్తో పాటు లిస్ట్-ఏ క్రికెట్లో బాబా ఇంద్రజిత్ యావరేజి 48గా ఉంది. 2018-19 దులిప్ ట్రోఫీలో ఇండియా గ్రీన్ తరుపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు.
జలజ్ సక్సేనా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని అన్ లక్కీ ప్లేయర్లలో జలజ్ సక్సేనా ఒకడు. గత దశాబ్దంగా దేశవాళీ క్రికెట్లో నిలకడకు మారుపేరుగా నిలిచాడు. 31 ఏళ్ల జలజ్ సక్సేనా గత నాలుగేళ్లలో నాలుగు బీసీసీఐ అవార్డులను సొంతం చేసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో అతడి సక్సెస్కు ఈ అవార్డులే నిదర్శనం. 2013 సీజన్లో జలజ్ సక్సేనాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసినప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. రెండేళ్ల పాటు ముంబై రిజర్వ్ బెంచికే పరిమితమైన జలజ్ సక్సేనాను ఆ తర్వాత వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి.
నవదీప్ షైనీ
ఈ మధ్య కాలంలో దేళవాళీ క్రికెట్లో భారత విజయాల్లో తరచూ వినిపిస్తోన్న పేరు నవదీప్ షైనీ. గత మూడు నాలుగేళ్ల నుంచి భారత జట్టులో కూడా అత్యుత్తమ పేస్ బౌలర్లు వెలుగులోకి వస్తున్నారు. ఢిల్లీకి చెందిన నవదీప్ షైనీ సుమారు 140 kmph తో బంతిని సంధించగలడు. 2017 ఐపీఎల్ వేలంలో నవదీప్ షైనీని ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంఛైజీ రూ. 10 లక్షలకు కొనుగోలు చేసింది. 2017-18 రంజీ సీజన్లో 34 వికెట్లు, 2018-19 విజయ్ హాజారే ట్రోఫీలో 16 వికెట్లు పడగొట్టాడు. గతేడాది నిర్వహించిన వేలంలో నవదీప్ షైనీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 3 కోట్లకు సొంతం చేసుకున్నప్పటికీ, తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.