కోహ్లీ మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "రాత్రి 7.30 సమయంలో మంచు ప్రభావం చూపిస్తుందని మాకు ఎవరో చెప్పారు. అందుకే ముందు బౌలింగ్ ఎంచుకున్నా. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆరంభంలోనే ఇలా మేం వికెట్లు కోల్పోలేదు. మూడేసి వికెట్లు తక్కువ వ్యవధిలో పడిపోవడం సిరీస్లో రెండు సార్లు జరిగింది. ఇకపై ఇలా కుప్పకూలిపోవడాన్ని చూడదల్చుకోలేదు. ఈ సమస్యను అధిగమించడంపై దృష్టి సారిస్తాం" అని అన్నాడు.
తర్వాతి మ్యాచ్లలో మార్పులు ఖాయం
"తర్వాతి మ్యాచ్లలో మార్పులు ఖాయం. చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పడంపై కసరత్తులు చేస్తాం. నేను ఆడిన చక్కటి ఇన్నింగ్స్లలో ఇది కూడా ఒకటి. మూడు వికెట్ల అనంతరం క్రీజులోకి వచ్చినప్పుడు ఒక్కటే అనుకున్నా.. నేను నా ఆటను ఆడుతా. తర్వాత ఏం జరుగుతుందనేది నాకు అనవసరం. కానీ నేను ఔటవ్వడం నిరాశను మిగిల్చింది. మేం గెలుస్తామని అనుకున్నా" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఆడమ్ జంపా అద్భుతం
"కానీ, ఆస్ట్రేలియా ఆటగాళ్లు మా కంటే చక్కటి ప్రదర్శన చేశారు. ఆడమ్ జంపా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వారు ఈ విజయానికి అర్హులు" అని కోహ్లీ తెలిపాడు. కోహ్లీ వ్యాఖ్యలను బట్టి నాలుగు, ఐదు వన్డేల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత మూడు వన్డేల్లో పేలవ ప్రదర్శన చేసిన శిఖర్ ధావన్, అంబటి రాయుడులలో ఎవరో ఒకరిపై వేటు పడొచ్చు.
281 పరుగులకే టీమిండియా ఆలౌట్
ఆస్ట్రేలియా నిర్దేశించిన 314 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 281 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా, కమిన్స్, రిచర్డ్సన్ తలో మూడు వికెట్లు తీసుకోగా... నాథన్ లియాన్కు ఒక వికెట్ లభించింది. ఈ విజయంతో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేల సిరీస్లో భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే మార్చి 10న మొహాలీ వేదికగా జరగనుంది.