మూడు దేశాల్లో కలిపి 11 టెస్టులాడితే
అలాంటిది ఈ ఏడాది ఈ మూడు దేశాల్లో కలిపి 11 టెస్టులాడితే.. అందులో తొమ్మిదిసార్లు ప్రత్యర్థి జట్లను భారత బౌలర్లు రెండేసిసార్లు ఆలౌట్ చేశారు. మిగతా రెండు టెస్టుల్లో కూడా ఒకదాంట్లో 17 వికెట్లు తీయగా, మరోకదాంట్లో 18 వికెట్లు తీశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు భారత పేస్ బౌలింగ్ దళం మరింత పటిష్టంగా ఉండటమే కారణం. ప్రస్తుతం ఆసీస్తో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భారత పేసర్లు అన్ని రంగాల్లోనూ ఆతిథ్య జట్టు పేసర్లకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చారు. ఆసీస్ పేసర్లతో పోలిస్తే భారత పేసర్లు పడగొట్టిన వికెట్లు, బంతిని స్వింగ్ చేసిన తీరు, గుడ్ లైన్ అండ్ లెంగ్త్ బంతులు ఇలా టెస్టు సిరిస్ ఆద్యంతం చక్కటి ప్రదర్శన చేశారు.
|
బుమ్రా, షమీ, ఇషాంత్ శర్మల ప్రదర్శన ముందు
భారత పేసర్లు బుమ్రా, షమీ, ఇషాంత్ శర్మల ప్రదర్శన ముందు స్టార్క్, కమిన్స్, హేజిల్వుడ్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లు సైతం చిన్నబోయారు. అయితే ఇది ఆస్ట్రేలియాలోనే మొదలు కాలేదు. 2018లో మూడు ప్రతిష్టాత్మక విదేశీ పర్యటనల్లో సత్తా చాటి భారత్ను గెలిపించగలరని భావించిన మన పేసర్లు ఆ నమ్మకాన్ని నిలబెట్టారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్లతో కూడిన భారత పేస్ దళం కళ్లు చెదిరే ప్రదర్శనలతో ఆశ్చర్యపరిచింది. సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాను మూడు టెస్టుల్లోనూ రెండేసిసార్లు భారత పేసర్లు ఆలౌట్ చేశారు. ఆపై ఇంగ్లాండ్లోనూ మన బౌలర్లు అంచనాల్ని మించి రాణించారు. అక్కడ ఐదు టెస్టుల్లో 75 వికెట్లు పడగొట్టారు.
ఒకే ఏడాది విదేశాల్లో ఇంత మంచి ప్రదర్శన
మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ, సెహ్వాగ్, జహీర్, కుంబ్లే ఉన్న కాలంలో కూడా టీమిండియా ఒకే ఏడాది విదేశాల్లో ఇంత మంచి ప్రదర్శన కనబర్చలేకపోయింది. ఇలా విదేశాల్లో 11 టెస్టు మ్యాచ్లు... ఇందులో 4 విజయాలు... భారత టెస్టు చరిత్రలో గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది విదేశాల్లో భారత జట్టు గెలిచిన నాలుగు టెస్టుల్లో పేసర్ల ప్రదర్శనను విశ్లేషిస్తే... జొహన్నెస్బర్గ్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో బుమ్రా 5 వికెట్లతో చెలరేగితే... రెండో ఇన్నింగ్స్లో షమీ 5 వికెట్లు పడగొట్టాడు. ఇక, నాటింగ్హామ్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో హార్ధిక్ పాండ్యా 5 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్లో బుమ్రా 5 వికెట్లతో చెలరేగాడు.
మూడు టెస్టుల్లో 47 వికెట్లు
అడిలైడ్ టెస్టులో ఐదు వికెట్ల ఘనతలు లేకపోయినా మన పేసర్లు కీలక సమయంలో వికెట్లు తీశారు. మెల్బోర్న్లో అయితే బుమ్రా మెరుపులకు ఇషాంత్, షమీ తోడయ్యారు. 1991-92 ఆస్ట్రేలియా సిరీస్లో ఐదు టెస్టుల్లో కలిపి భారత పేసర్లు 57 వికెట్లు తీస్తే ఇప్పుడు మూడు టెస్టుల్లోనే 47 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఆసీస్ స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేకపోవడం వల్ల ఆస్ట్రేలియా బ్యాటింగ్ బలహీన పడి ఉండొచ్చు కానీ, భారత పేసర్ల శ్రమను తక్కువ చేయలేం. గతంలో విదేశాల్లో భారత్ ఎప్పుడు పర్యటించినా ఒకరు లేదా ఇద్దరు పేసర్లు ఉండటం, వారిలో ఎవరో ఒకరి వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే హైలైట్ అయ్యేవి. ప్రస్తుత సిరిస్లో అందరూ సమిష్టిగా రాణించడం వల్లే అద్భుత ఫలితాలు వస్తున్నాయి.