
హైదరాబాద్: 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ను ధోనీసేన గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2014 టీ20 ప్రపంచకప్లో కూడా అద్భుత ప్రదర్శన చేసిన భారత్.. తృటిలో టైటిల్ కోల్పోయింది. మెగా టోర్నీలో పరాజయం ఎరుగకుండా శ్రీలంకతో తుదిపోరుకు 2014 ఏప్రిల్ 6న బరిలోకి దిగింది. టోర్నీలో మొదటి నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ధోనీసేన టైటిల్ పట్టడం ఖాయమని అందరూ అంచనా వేశారు. అయితే సీన్ రివర్స్ అయింది. విరాట్ కోహ్లీ అద్భుతంగా పోరాడినా.. యువరాజ్ సింగ్ ధాటిగా ఆడలేకపోవడంతో భారత్ ఓడిపోయింది. ఆ మరపురాని పరాభవానికి నేటికి ఆరేళ్లు.
బంగ్లాదేశ్ ఢాకా వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్భారత్ పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. ఓపెనర్ అజింక్య రహానే (3) త్వరగానే పెవిలియన్ చేరగా.. కాసేపు బాగానే ఆడిన రోహిత్ (29) కూడా వెనుదిరిగాడు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా విరాట్ కోహ్లీ మాత్రం వీరోచితంగా పోరాడాడు. కోహ్లీ 58 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 77 పరుగులు చేసాడు. అయితే యువరాజ్ సింగ్ చివరలో భారీ షాట్లు ఆడడంలో విఫలమయ్యాడు.
లంక బౌలర్లు వేసే బంతులకు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ వచ్చిన యువరాజ్.. ఇన్నింగ్స్ చివరలో 21 బంతులు ఆడి కేవలం 11పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక ఎంఎస్ ధోనీ సైతం 7 బంతులు ఎదుర్కొని 4పరుగులే చేసాడు. దీంతో భారత్ 130 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత కుమార సంగక్కర (35 బంతుల్లో 52) సహా మిగిలిన వారు ఆకట్టుకోవడంతో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో 13 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. దీంతో రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలువాలన్న భారత్ ఆశ చెదిరింది. యువరాజ్ వేగంగా ఆడలేకపోవడంతో అప్పట్లో అతడిపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఆ ఇన్నింగ్స్ అతడి కెరీర్నే ముగించేలా చేసింది.
మరోవైపు 2014లో ఇదే రోజు ఆస్ట్రేలియా మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టుకు ఇది వరుసగా మూడో టైటిల్ కావడం విశేషం. తొలుత బ్యాటింగ్చేసిన ఇంగ్లండ్ను 105 పరుగులకే కట్టిడి చేసిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి టైటిల్ అందుకుంది. ఈ రెండు ప్రపంచకప్లకు సంబందించిన వీడియోలను ఐసీసీ ఈ రోజు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.