హైదరాబాద్: భారత క్రికెట్ చరిత్రలో కొన్ని మ్యాచ్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. వరల్డ్కప్ సాధించడం లేదా వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీల్లో పాకిస్థాన్ జట్టుపై టీమిండియా విజయం సాధించడం లాంటివి. అలాంటి మ్యాచ్లు భారత క్రికెట్ అభిమాని గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి.
ఈ కోవలోకి వచ్చే ఓ గొప్ప మ్యాచ్ నాట్వెస్ట్ ఫైనల్ మ్యాచ్(జులై 13, 2002). ఇంగ్లాండ్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ గుర్తుకు రాగానే ముందుగా మదిలో మెదిలే అపురూప ఘట్టం టీమిండియా మాజీ కెప్టెన్, సౌరవ్ గంగూలీ చొక్కా విప్ప చేసిన హంగామా.
ఈ అపురూపమైన ఘట్టానికి నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ శుక్రవారం అభిమానులతో పంచుకుంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన నాట్వెట్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయానంతరం బాల్కనీలో ఉన్న గంగూలీ చొక్కా విప్పి చేసిన సంబరాలు చేసుకున్నాడు.
July 13, 2002 - #TeamIndia won the NatWest series final #ThisDayThatYear @MohammadKaif @ImZaheer @YUVSTRONG12 @SGanguly99. That epic moment - Etched forever!pic.twitter.com/jKeFXEmCgk
— BCCI (@BCCI) July 13, 2018
అప్పట్లో ఇదొక సంచలనం. తన దూకుడుతో భారత్ క్రికెట్ ఆటతీరునే మార్చేసిన అత్యుత్తమ కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ ఒకడు. ప్రత్యర్థి స్టేడియంలో చొక్కా విప్పి భారత్ విజయాన్ని సగర్వంగా ఆస్వాదించడం ఒక్క గంగూలీకే చెల్లింది. ఈ మ్యాచ్లో యువరాజ్సింగ్, మహ్మద్ కైఫ్ ఆఖరి వరకు పోరాడి భారత్కు చిరస్మరణీయ విజయం అందించారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు యువరాజ్ సింగ్ (63 బంతుల్లో 69), కైఫ్ (87) పరుగులు చేసి సెంచరీ భాగస్వామ్యంతో భారత విజయంలో కీలకపాత్ర పోషించారు.