ముంబై: మాజీ హెవీ వెయిట్ వరల్డ్ ఛాంపియన్ మైక్ టైసన్ త్వరలో భారత్లో పర్యటించనున్నాడు. అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ లీగ్ ప్రాచుర్య కార్యక్రమంలో భాగంగా వచ్చే సెప్టెంబర్ 29న మైక్ టైసన్ ముంబైకి రానున్నాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్ఎమ్ఏ) ఈవెంట్ అయిన కుమిటే-1 లీగ్ను ప్రచారం చేసేందుకు ముంబై వస్తున్నారని లీగ్ వర్గాలు తెలిపాయి.
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో ప్రపంచంలోనే కుమిటే-1 లీగ్ మొదటిది. ఈ లీగ్తో ఆల్ ఇండియా మిక్స్డ్ మార్షియల్ ఆర్ట్స్ ఫెడరేషన్ కూడా భాగస్వామ్యం చేసుకుంది. ఆయా దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు కూడా ఈ పోటీల్లో పాల్గొనబోతున్నాయి. తొలిసారిగా జరిగే ఈ టోర్నీలో భారత్ తమ తొలి బౌట్లో యూఏఈని ఎదుర్కొంటుంది.
ఈ సందర్భంగా మైక్ టైసన్ మాట్లాడుతూ "భారత దేశాన్ని తొలిసారి సందర్శించబోతున్నా. కుమిటే-1 లీగ్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈవెంట్ను లాంచ్ చేసేందుకు ఇండియాకు వస్తున్నా. భారత్లో నా అభిమానులను కలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని పేర్కొన్నాడు.
మరోవైపు ఈ లీగ్ వ్యవస్థాపకులు మొహమ్మద్ అలీ బుద్వాని మాట్లాడుతూ కుమిటే లీగ్ కోసం ప్రపంచ మాజీ చాంపియన్ రానుండటం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. మైక్ టైసన్ కెరీర్లో అతి పెద్ద సంచలనం 1986లో నమోదైంది. 20 ఏళ్ల వయస్సులోనే డిఫెండింగ్ చాంపియన్ ట్రెవర్ బెర్బిక్ను మట్టికరిపించి వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ (డబ్ల్యుబీసీ)ను గెలుచుకున్నాడు.
ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం. చిన్న వయస్సులోనే అతడు ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్ను అందుకుని మైక్ టైసన్ సంచలనాన్ని నమోదు చేసింది. డబ్ల్యుబిఎ, డబ్ల్యుబిసి, ఐబిఎఫ్ ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్షిప్ టైటిళ్లను గెల్చుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన టైసన్ ఆతర్వాత పలు వివాదాల్లో చిక్కుకొని ఆర్థికంగా చితికిపోయాడు.
టైసన్ ఆతర్వాత పలు వివాదాల్లో చిక్కుకొని ఆర్థికంగా చితికిపోయాడు. 20 ఏళ్ల వయసులోనే ప్రపంచ చాంపియన్గా విశేష కీర్తిప్రతిష్ఠలు రావడంతో అతను క్రమశిక్షణను పూర్తిగా మరచిపోయాడు. ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారం కేసులో జైలు శిక్షను కూడా అనుభవించాడు.
కెరీర్ నాశనమై, ఆస్తి మొత్తం వివాదాలు, సెటిల్మెంట్లకు ఆహుతికాగా, ఉపాధి కోసం స్టార్ హోటళ్లలో ఎగ్జిబిషన్ బాక్సింగ్ ఫైట్స్లో పాల్గొన్నాడు. క్రమంగా నిలదొక్కుకొని, ఇప్పుడు ఎంటిఎ పేరుతో ఫిట్నెస్ సెంటర్ల వ్యాపారాన్ని ఆరంభించి, తక్కువ సమయంలోనే లాభాల బాట పట్టించాడు.