న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్కు తీవ్ర నిరాశ ఎదురైంది. కరోనా మహమ్మారి కారణంగా సింగపూర్ ఓపెన్ రద్దవడంతో ఇద్దరి టోక్యో ఒలింపిక్స్ ఆశలు ఆవిరయ్యాయి. విశ్వక్రీడలకు చివరి అర్హత టోర్నీ నిలిచిపోవడంతో క్వాలిఫికేషన్ ర్యాంకింగ్స్ పాయింట్లలో వెనుకబడి ఉన్న లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా, ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్కు టోక్యో తలుపులు దాదాపు మూసుకుపోయాయి.
IPL 2021: 'ప్రతిసారీ యూఏఈకి వెళ్లలేం.. బీసీసీఐని విమర్శించడం తప్పు! ఐపీఎల్ మన టోర్నమెంట్'
కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రయాణ ఆంక్షలు ఉండడంతో జూన్ 1 నుంచి 6 వరకు జరుగాల్సిన సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టోర్నీని రద్దు చేస్తున్నట్టు సింగపూర్ బ్యాడ్మింటన్ సంఘం (ఎస్బీఏ), ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం ప్రకటించాయి. 'క్రీడాకారులు, అధికారులు, స్థానిక ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సింగపూర్ ఓపెన్ను రద్దు చేస్తున్నాం. ఈ టోర్నీ కోసం కొత్త తేదీల్ని ప్రకటించం. టోర్నీలో పాల్గొనే క్రీడాకారులకు సురక్షిత వాతావరణం అందించడం కోసం నిర్వాహకులు, బీడబ్ల్యూఎఫ్ అన్ని ప్రయత్నాలు చేశాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ప్రయాణాల నిర్వహణను సంక్లిష్టమైన సవాళ్లుగా మార్చాయి' అని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది.
టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన ప్లేయర్ల జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. కాగా భారత్ తరఫున మహిళల సింగిల్స్లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, పురుషుల సింగిల్స్లో బి.సాయి ప్రణీత్, పురుషుల డబుల్స్లో సాత్విక్సాయిరాజ్- చిరాగ్శెట్టి ఒలింపిక్స్ బెర్త్లు దక్కించుకోనున్నారు. నిజానికి భారత్లో జరగాల్సిన ఇండియా ఓపెన్ రద్దయినప్పుడే సైనా, శ్రీకాంత్, సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్పల ఒలింపిక్స్ అర్హత అవకాశాలు సన్నగిల్లాయి. అయితే మలేసియా ఓపెన్ (మే 25- 30), సింగపూర్ ఓపెన్లలో సత్తాచాటి ఒలింపిక్స్కు అర్హత సాధించొచ్చని వారు ఆశించారు. కరోనాతో మలేసియా ఓపెన్ వాయిదా పడటం సైనా, శ్రీకాంత్, సిక్కి జోడీల అవకాశాల్ని మరింత దెబ్బతీసింది. తాజాగా సింగపూర్ ఓపెన్ రద్దు నిర్ణయం ఒలింపిక్స్ ద్వారాల్ని దాదాపుగా మూసేసింది.
31 ఏళ్ల సైనాకు టోక్యోనే చివరి ఒలింపిక్స్ అవనుందా అంటే.. అదే సమాధానం రానుంది. 2020లోనే ఒలింపిక్స్ జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. 2021లో కూడా జరిగేది అనుమానమే. ఈసారి కూడా సాధ్యంకాకపోతే టోక్యో ఒలింపిక్స్ రద్దవడం ఖాయం. ఇక క్రీడాకారులంతా 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు ఆగాల్సిందే. అయితే కెరీర్ చరమాంకంలో ఉన్న సైనా అప్పటి వరకు ఆట కొనసాగిస్తుందా? లేదో చూడాలి. ఎందుకంటే అప్పటికి ఆమెకు 34 ఏళ్లు వస్తాయి.