ఒడెన్స్ (డెన్మార్క్): భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నమెంట్ తొలి రౌండ్లోనే ఓడిపోయి ఇంటిదారి పట్టారు. దీంతో ఈ సీజన్లో సైనా, శ్రీకాంత్లకు మరోసారి నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ సైనా 15-21, 21-23తో సయాక తకహాషి (జపాన్) చేతిలో పోరాడి ఓడింది. 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో టకహషి పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
మ్యాచ్ ఆరంభంలో సైనా కోర్టులో నెమ్మదిగా కదిలింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న టకహషి వేగంగా ఆడుతూ 21-15తో తొలి గేమ్ను కైవసం చేసుకుంది. రెండో గేమ్లో పుంజుకున్న సైనా.. టకహషికి దీటుగా బదులిచ్చింది. స్కోర్లు 21-21తో సమమైనప్పుడు వరుసగా రెండు పాయింట్లు సాధించిన టకహషి గేమ్తో పాటు మ్యాచ్నూ సొంతం చేసుకుంది. ఈ ఏడాది తకహాషి చేతిలో సైనా ఓడిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిడాంబి శ్రీకాంత్ 14-21, 18-21తో అండర్స్ అంటాన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. మోకాలి గాయంతో చైనా ఓపెన్, కొరియా ఓపెన్ టోర్నీల్లో బరిలోకి దిగని శ్రీకాంత్.. డెన్మార్క్ ఓపెన్లో ఆకట్టుకోలేకపోయాడు. 2017 ప్రపంచ చాంపియన్షిప్లో ఆంటోన్సెన్పై ఇదే స్కోరుతో శ్రీకాంత్ విజయం సాధించడం విశేషం. ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్స్, బార్సిలోనా మాస్టర్స్, యూరోపియన్ గేమ్స్లలో స్వర్ణాలు నెగ్గిన ఆంటోన్సెన్ ప్రపంచ చాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచాడు.
శ్రీకాంత్ నిష్క్రమించినా.. సమీర్ వర్మ ప్రీక్వార్టర్స్కు దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో సమీర్ వర్మ 21-11, 21-11తో కంటా సునేయమా (జపాన్)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ జెర్రీ చోప్రా-సిక్కిరెడ్డి జోడీ ముందంజ వేసింది. మొదటి రౌండ్లో ప్రణవ్-సిక్కి జంట 21-16, 21-11తో జర్మన్ ద్వయం మార్విన్ సిడెల్-లిండా ఎఫ్లర్పై గెలిచింది. సాత్విక్-అశ్విని పొన్నప్ప జంట వాంగ్ యి లియు-హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) జోడీకి బై ఇచ్చింది.