
హైదరాబాద్: ఎంతో నిరీక్షణ తర్వాత స్వర్ణ పతకం సాధించానని భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు అన్నారు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన సింధు మంగళవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చారు. సింధుతో పాటు ఆమె తండ్రి పీవీ రమణ, కోచ్ పుల్లెల గోపీచంద్, తదితరులు నగరానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా సింధుతో పాటు కోచ్ పుల్లెల గోపీచంద్కు తెలంగాణ ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ దినకరన్ బాబు తదితరులు సింధుకు ఘనస్వాగతం పలికారు. అనంతరం బేగంపేట నుంచి పుల్లెల గోపీచంద్ అకాడమీకి సింధు బయల్దేరి వెళ్లారు.
గోపీచంద్ అకాడమీలో పీవీ సింధు మాట్లాడుతూ "ఎన్నో రోజులు నా నిరీక్షణ ఫలించింది. ఈ విజయం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నా తల్లిదండ్రుల సహకారం మరువలేది. అందరి దీవెనలతో టైటిల్ సొంతం చేసుకున్నాను. నాకు మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు" అని అన్నారు.

"గతంలో సెమీస్లో ఓడినప్పుడు సమీక్ష చేసుకున్నాను. 2 రజతాలు, 2 కాంస్యాల తర్వాత స్వర్ణం కల సాకారమైంది. ప్రతిసారి ఒకే రకమైన గేమ్ప్లాన్ పనిచేయదు" పీవీ సింధు ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా, మంగళవారం ఉదయం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజులను సింధు కలిసిన సంగతి తెలిసిందే.
స్విట్జర్లాండ్లోని బాసెల్ వేదికగా జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకుని సింధు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరతో జరిగిన ఫైనల్లో 21-7, 21-7 తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఫలితంగా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ టైటిల్ సాధించిన తొలి భారత షట్లర్గా సింధు చరిత్ర సృష్టించింది.