టోక్యో: ఒలింపిక్స్ 2020లో క్వార్టర్స్లో గెలవడం ఆనందంగా ఉందని, అయితే ఇప్పుడే అంతా అయిపోయినట్లు కాదని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. సెమీఫైనల్ మ్యాచ్కు మరింత కఠినంగా సన్నద్ధమవ్వాలని చెప్పింది. మహిళల సింగిల్స్లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21-13, 22-20తో నాలుగో సీడ్, జపాన్ ప్లేయర్ అకానె యమగుచిని వరుస గేముల్లో ఓడించింది. సెమీ ఫైనల్లో సింధు వరల్డ్ నెంబర్ 1, తై జూ యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడనుంది. ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే.. సింధు ఖాతాలో మెడల్ ఖాయం.
మ్యాచ్ అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ... 'చాలా సంతోషంగా ఉంది. అయితే అప్పుడే అంతా అయిపోలేదు. ఇప్పుడు నేను వెనక్కి వెళ్లి మ్యాచ్ను సమీక్షించుకోవాలి. ఆ తర్వాత కొంత రిలాక్స్ అయ్యి తదుపరి మ్యాచ్కు సిద్ధమవ్వాలి. ఈ మ్యాచ్లో రెండో గేమ్లో షాట్ ర్యాలీలు సుదీర్ఘంగా జరిగాయి. నేను ఆధిక్యంలో ఉన్నప్పటికీ యమగూచి కూడా బలంగా పుంజుకుంది. దాంతో నేను రిలాక్స్ అవలేకపోయా. నావైపు కూడా కొన్ని తప్పిదాలు జరిగాయి. యమగూచి గేమ్ పాయింట్కు వచ్చినా.. నేను ఆందోళన చెందలేదు. 'ఏం కాదు.. మ్యాచ్పై దృష్టిపెట్టు. తప్పకుండా గెలుస్తావు' అని కోచ్ చెప్పారు. ఆయన నాకు అండగా నిలిచారు' అని చెప్పింది.
MS Dhoni: సరికొత్త లుక్లో మహీ.. కుర్రాళ్లు ఫిదా! వేరే లెవల్ హీరో ధోనీ!!
కూతురి అద్భుత ప్రదర్శనపై పీవీ సింధు తండ్రి రమణ హర్షం వ్యక్తం చేశారు. యమగూచిపై సింధు విజయం అనంతరం ఆయన హైదరాబాద్లోని స్వగృహంలో మాట్లాడుతూ... 'ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సింధు ఒత్తిడిని జయించి విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ప్రత్యర్ధిపై సింధు చాలా బాగా ఆడింది. ఈ విజయంలో కోచ్ సహా అందరి సమష్టి కృషి ఉంది. సింధు దేశానికి మంచి పేరు తెస్తున్నందుకు ఆనంద పడుతున్నా. సెమీస్లో కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని రమణ ధీమా వ్యక్తం చేశారు.
సెమీ ఫైనల్లో పీవీ సింధు చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్తో పోటీ పడనుంది. సింధుకు ఇది చాలా కఠినమైన మ్యాచ్ అనే చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరూ తలపడిన ప్రతిసారి మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంటుంది. తై జు, సింధు 18 సార్లు తలపడగా.. 13 సార్లు చైనీస్ తైపీ క్రీడాకారిణినే విజయం సాధించింది. 5 విజయాలతో సింధు వెనుకంజలో ఉంది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం జరగబోయే సెమీస్ పోరు కూడా రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి. ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో రెండుసార్లు సెమీస్కు వెళ్లిన తొలి షట్లర్ సింధునే. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్లో సింధు రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే.