హైదరాబాద్: 'క్రీడాగ్రామంలో మా నాన్నను అనుమతించే అక్రిడిటేషన్ కార్డు ఇవ్వకుంటే నేను కామన్వెల్త్ గేమ్స్లో ఆడను' గోల్డ్ కోస్ట్ వేదికగా ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ ఈవెంట్ సందర్భంగా భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చెప్పిన మాట. దీంతో ఐఓఏ రంగప్రవేశం చేసి వెంటనే సైనా తండ్రికి అక్రిడిటేషన్ వచ్చేలా చేసింది.
అప్పట్లో ఇది పెను వివాదానికి దారి తీసింది. నాన్నకు అక్రిటిడేషన్ కార్డు ఇవ్వనంత మాత్రాన దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చే ప్రతిష్టాత్మక గేమ్స్ను పణంగా పెట్టడమేంటని సైనా నెహ్వాల్పై అప్పట్లో నెటిజన్లు, క్రీడా వర్గాలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు, ప్టెంబర్లో ఇండోనేసియా వేదికగా ఆసియా గేమ్స్ జరగనున్నాయి.
ఆసియా గేమ్స్లో ఎలాంటి ఈ వివాదాలకు తావివ్వరాదని భావించో, ఏమో తెలియదు గానీ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఓ కీలక నిర్ణయాన్ని శనివారం వెల్లడించింది. ఆసియా గేమ్స్లో పాల్గొనే భారత క్రీడాకారులకు తోడుగా వారి తల్లిదండ్రులెవరినీ అనుమతించకూడదని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కీలక నిర్ణయం తీసుకుంది.
క్రీడాకారుల కుటుంబ సభ్యులెవరికీ అక్రిడిటేషన్లు ఇవ్వబోమని ఐఓఏ స్పష్టం చేసింది. అయితే సహాయక బృందంలో కోచ్, ఫిజియో, ట్రెయినర్లలో ఎవరైనా తల్లిదండ్రులు, భర్త, భార్య ఉంటే అక్రిడిటేషన్లు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని పేర్కొంది. ఆసియా గేమ్స్కు ఐఓఏ ఏకంగా 900 మందితో కూడిన జంబో జట్టును పంపే ప్రణాళికలో ఉంది.