శిక్షణ ఇచ్చేందుకే మొగ్గు:
ఈ సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లు ఆడినా కూడా గోపీచంద్ వారితో ప్రయాణించడం లేదు. ఈ ఏడాది అయితే గోపీ ఎక్కువగా అకాడమీలో శిక్షణ ఇచ్చేందుకే మొగ్గు చూపారు. దీన్నే ఈ ఏడాది చివరి వరకు కొనసాగించాలని గోపీచంద్ నిర్ణయించుకున్నారట. ఇదే విషయంపై తాజాగా గోపీచంద్ స్పందించారు.
మరో సింధు దొరకదు:
'ప్రతిసారి టాప్ క్రీడాకారులతో టోర్నీలకు వెళుతుంటే వారి తర్వాతి స్థాయిలో ఉన్న షట్లర్ల పరిస్థితి ఏంటి?. టోర్నీల కోసం ప్రయాణించడమే పనిగా పెట్టుకుంటే ఒక సింధు వెలుగులోకి వచ్చేదా?. ప్రతీసారి ఆటగాళ్లతో ప్రయాణిస్తే మనకు మరో సింధు దొరకదు. మనకు ఎక్కువ కోచ్ల అవసరం ఉంది. ఒక్కడినే అన్నీ చేయలేను. నాకు ఇతరుల సహాయం, మద్దతు అవసరం' అని గోపీచంద్ పేర్కొన్నారు.
కొన్ని టోర్నీలకు వెళుతా:
'గత పదేళ్లుగా కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ ఉన్న ఏడాదిలోనే ఆటగాళ్లతో కలిసి టోర్నీలకు వెళ్లా. ప్రతీ ఒక్కరు సూచనలు తీసుకోవాలని, నేను వారి కోసం ఎక్కువ సమయం వెచ్చించాలని కోరుకుంటారు. అయితే ప్రతీసారి సాధ్యం కాదు. నేను అక్కడ లేను కాబట్టి తాము ఓడామని, ఉంటే గెలిచేవాళ్లమని కొందరు షట్లర్లు చెబుతారు. వచ్చే ఏడాది ఒలింపిక్స్ ఉండటంతో కొన్ని టోర్నీలకు వెళుతా' గోపీ తెలిపారు.
శుభారంభం:
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నమెంట్లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు 11-21, 21-15, 21-15తో జపాన్కు చెందిన అయా ఒహొరిపై విజయం సాధించింది. అయా ఒహోరిపై సింధుకిది వరుసగా ఏడో విజయం. సింధు తర్వాతి రౌండ్లో మియా బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21-14, 21-13తో జపాన్ ఆటగాడు కెంటా నిషిమొటోను అలవోకగా ఓడించాడు. ప్రీక్వార్టర్ ఫైనల్లో హాం కాంగ్కు చెందిన కా లాంగ్ ఆగ్నస్ను శ్రీకాంత్ ఢీకొంటాడు.