
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ అనారోగ్యం పాలైంది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న సైనాను వైద్యులు పరీక్షించారు. అన్నాశయానికి సంబంధించిన సమస్యగా గుర్తించి ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ విషయాన్ని బుధవారం తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.
"చేదు వార్త.. గత సోమవారం నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నా. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్లో ఆ నొప్పితోనే కొన్ని మ్యాచ్లాడా. నొప్పి ఎక్కువవడంతో స్విస్ ఓపెన్లో పాల్గొనకుండా స్వదేశం వచ్చేశా. వైద్యులు ఆసుపత్రిలో చేరాలని సూచించారు. త్వరలోనే కోలుకుంటాననే నమ్మకంతో ఉన్నా" అని సైనా చెప్పింది.
స్విస్ ఓపెన్లో కశ్యప్ శుభారంభం:
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, శుభాంకర్ డే రెండో రౌండ్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో కశ్యప్ 21-19, 21-17తో ఫెలిక్స్ బ్యూరెస్డెట్ (స్వీడన్)పై, శుభాంకర్ 21-19, 21-17తో లుకాస్ క్లియర్బౌట్ (ఫ్రాన్స్)పై గెలిచారు.
ఇక, మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో జక్కా వైష్ణవి రెడ్డి 12-21, 23-21, 17-21తో క్రిస్టిన్ కుబా (ఎస్తొనియా) చేతిలో, గుమ్మడి వృశాలి 14-21, 11-21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జోడీ 21-15, 21-17తో రాల్ఫీ జాన్సెన్-కిలాసు (జర్మనీ) జోడీపై నెగ్గింది.