
ఢిల్లీ: భారత స్టార్ బ్యాండ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఢిల్లీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో అమె కాషాయ కండువా కప్పుకున్నారు. హర్యానా రాష్ట్రంలో జన్మించిన సైనా దేశంలోనే విజయవంతమైన క్రీడాకారిణిగా నిలిచారు.
పార్టీలో చేరిక తర్వాత బీజేపీ కార్యాలయంలో సైనా నెహ్వాల్ మీడియాతో మాట్లాడారు. దేశం కోసం ఎన్నో మంచిపనులు చేస్తోన్న బీజేపీ గొప్ప పార్టీఅని, ఆ కుటుంబంలో సభ్యురాలినైననందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీలాంటి విశిష్టవ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం లభించడం వరంలాంటిదన్నారు.
దేశానికి మరింత మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సైనా నెహ్వాల్ చెప్పారు. 'సంపర్క్ సే సమర్థన్' కార్యక్రమంలో భాగంగా అమిత్ షా గతేడాది హైదరాబాద్ వచ్చి సైనా కుటుంబాన్ని కలుసుకున్న సంగతి తెలిసిందే. ఇదే సైనా నెహ్వాల్ పొలిటికల్ ఎంట్రీకి దారి తీసినట్లు తెలుస్తోంది.
సైనా నెహ్వాల్ గతంలో అనేక సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా బ్యాడ్మింటన్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సైనా.. ఇక నుంచి రాజకీయాల్లో తనదైన ముద్రవేయనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ తరపున సైనా స్టార్ కాంపైనర్గా చేయనున్నారు.
29 ఏళ్ల సైనా నెహ్వాల్ 20 ఇంటర్నేషనల్ టైటిల్స్ను గెలుచుకున్నారు. అద్భుత ఆటతో సైనా నెహ్వాల్ 2009లో ప్రపంచ నంబర్ 2, 2015 సంవత్సరంలో ప్రపంచ నంబర్ వన్ స్థానానికి సాధించారు. ప్రస్తుతం సైనా తొమ్మిది ర్యాంకులో కొనసాగుతున్నారు. హర్యానాలోని హిస్సార్లో మార్చి 17, 1990న సైనా నెహ్వాల్ జన్మించారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సాధించిన వారే.
హైదరాబాద్లోని జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకున్న సైనా.. విజయవంతమైన క్రీడాకారిణిగా నిలిచారు. 2015లో ప్రపంచంలోనే నంబర్ వన్ ర్యాంకింగ్ మహిళా షట్లర్గా రికార్డు సృష్టించారు. తోటి క్రీడాకారుడైన పారుపల్లి కశ్యప్ను సైనా వివాహం చేసుకున్నారు.
ఇప్పటికే భారత రాజకీయాల్లోకి పలువురు క్రీడాకారులు వచ్చిన విషయం తెలిసిందే. క్రికెటర్ గౌతం గంభీర్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, భారత హాకీ టీమ్ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్, రెజ్లర్ బాబిత ఫోగట్ గతేడాది భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం విదితమే.