థాయ్లాండ్లోని బ్యాంకాక్లో గురువారం జరిగిన థామస్ ఉబెర్ కప్లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు తొలిసారిగా సెమీఫైనల్ చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో మలేషియాపై 3-2తో చిరస్మరణీయమైన విజయం సాధించిన భారత మెన్స్ టీం 43ఏళ్ల తర్వాత దేశానికి ఈ టోర్నీలో మెడల్ తీసుకురానుంది. దీంతో థామస్ కప్లో భారత్కి కనీసం కాంస్యం ఖాయమైంది. 1979 నుండి ఈ ఈవెంట్లో దేశం పతకం గెలవలేదు. భారత మహిళల జట్టు గురువారం బ్యాంకాక్లో జరిగిన ఉబెర్ కప్లో థాయ్లాండ్తో 0-3తేడాతో ఓడిపోయి ఇంటి బాట పట్టింది. గతంలో భారత్ ఇంటర్ జోనల్ ఫైనల్స్కు చేరుకున్నప్పుడు మూడు కాంస్యాలు సాధించింది. అయితే క్వాలిఫయింగ్ ఫార్మాట్లో మార్పు తర్వాత థామస్ ఉబెర్ కప్లో పతకం సాధించడం ఇదే తొలిసారి.
ప్రపంచ ఛాంపియన్షిప్ల కాంస్య విజేత లక్ష్య సేన్ ఓపెనింగ్ సింగిల్స్లో 46నిమిషాలు పోటీ పడి ప్రపంచ ఛాంపియన్ లీ జి జియా చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్లో చిరాగ్ శెట్టి, సాత్విక్సాయిరాజ్ రాంకిరెడ్డి... గోహ్ స్జె ఫీ, నూర్ ఇజ్జుద్దీన్ల జోడీపై 21-19 21-15తేడాతో గెలిచింది. తర్వాత మూడో గేమ్లో కిదాంబి శ్రీకాంత్ తన స్ట్రోక్ప్లేతో 21-11 21-17తో ప్రపంచ ర్యాంకర్ ఎన్జీ టిజ్ యాంగ్ను ఓడించడంతో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాతి మ్యాచ్ డబుల్స్లో విష్ణువర్ధన్ గౌడ్ పంజాల, ఆరోన్ చియా జోడీ 19-21 17-21 తేడాతో ఓడిపోవడంతో 2-2గా సిచువేషన్ మారింది. చివరి మ్యాచ్ డిసైడర్గా మారగా.. టీమిండియా ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్.. జున్ హావోపై 21-13 21-8 తేడాతో గెలుపొందడంతో భారత శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. దీంతో ఇండియా సెమీస్ చేరింది. ఇకపోతే మహిళల టీంలో పివీ సింధుతో సహా భారత ప్లేయర్లు నిరాశపరచడంతో క్వార్టర్ ఫైనల్లో థాయ్లాండ్ చేతిలో 0-3తేడాతో ఓడిపోయింది. పీవీ సింధు 59నిమిషాల పాటు సాగిన తొలి మహిళల సింగిల్స్ మ్యాచ్లో ఎనిమిదో ర్యాంక్లో ఉన్న ఇంటానాన్తో తలపడి 21-18 17-21 12-21 తేడాతో ఓడిపోయింది.
భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు మలేషియాపై 3-2తో చిరస్మరణీయమైన విజయం సాధించి 43ఏళ్ల తర్వాత తొలిసారిగా థామస్ కప్లో సెమీ-ఫైనల్లోకి ప్రవేశించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నేడే సాయంత్రం జరగనున్న సెమీస్లో మొదటి మ్యాచ్లో ప్రపంచ నం.1 విక్టర్ అక్సెల్సెన్తో లక్ష్య సేన్ తలపడనున్నాడు. రెండో గేమ్లో సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ద్వయం కిమ్ అస్ట్రప్, మథియాస్ క్రిస్టియన్సెన్లతో తలపడతారు. మూడో గేమ్లో కిదాంబి శ్రీకాంత్ ప్రపంచ నం.3 అండర్స్ ఆంటోన్సెన్తో తలపడనున్నాడు. చివరి మ్యాచ్లో హెచ్ఎస్ ప్రణయ్, రాస్మస్ జెమ్కేతో తలపడనున్నాడు. ఈ ఈవెంట్లో గెలిస్తే భారత్కు రజతం ఖాయమవుతుంది.