హైదరాబాద్: జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్కు వైద్య సిబ్బంది హోం క్వారంటైన్ స్టాంప్ వేశారు. 28 రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని ఆయనకు సూచించారు. 20 రోజుల క్రితం విజయవాడకు వెళ్లిన గోపీచంద్.. అనుమతులతో సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్కు బయలుదేరాడు. గోపీతో పాటు వాహన డ్రైవర్ కూడా ఉన్నాడు.
బాక్సింగ్ రింగ్లోకి తిరిగి వస్తున్నా.. మైక్ టైసన్ సంచలన ప్రకటన!!
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్రోడ్డు చెక్పోస్టు వద్ద గోపీచంద్ వాహనాన్ని ఆపిన వైద్య సిబ్బంది.. అతనికి థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహించి సంబంధిత వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ లక్షణాలు లేనప్పటికీ నిబంధనల ప్రకారం 28 రోజుల పాటు స్వీయ గృహనిర్బంధంలో ఉండాలని ఆదేశిస్తూ క్వారంటైన్ స్టాంప్ వేసినట్లు కోదాడ మండల వైద్యాధికారి కల్యాణ్ చక్రవర్తి తెలిపారు.
ప్రమాదకర కరోనా వైరస్ విస్తరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నియంత్రణలోకి వచ్చాక ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆట పునరుద్ధరణలో కీలక మార్పులు చేయాలని గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు తరచూ ప్రయాణించే వీలు లేకుండా, ఒకే వేదికపై అనేక టోర్నీలు నిర్వహిస్తే బాగుంటుందన్నాడు. కరోనా కారణంగా బీడబ్లూఎఫ్ జూలై చివరి వరకు అన్ని ముఖ్యమైన టోర్నీలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
పరిస్థితులు సద్దుమణిగాక ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీడబ్ల్యూఎఫ్ చర్యలు తీసుకోవాలని గోపీచంద్ పేర్కొన్నాడు. కరోనా అనంతర పరిస్థితులకు అనుగుణంగా బీడబ్ల్యూఎఫ్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. టోర్నీల నిర్వహణ, ఫార్మాట్ ఇలా అవసరమున్న అన్ని అంశాల్ని సవరించాలని గోపీ అన్నాడు. వాయిదా పడిన థామస్ ఉబెర్ కప్ ఫైనల్, ఒలింపిక్ క్వాలిఫయర్స్కు కొత్త షెడ్యూల్ను ప్రకటించాలని ఆతిథ్య దేశాలను ప్రపంచ సమాఖ్య కోరింది. దీనిపై స్పందించిన గోపీ... 'మీరు టోర్నీ తేదీల మార్పు గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ టోర్నీల నిర్వహణపై ఆలోచనా విధానం మారాలి. ఆటగాళ్లంతా ఒకే వేదికపై ఎక్కువ టోర్నీలు ఆడేలా ప్రణాళికలు రచించాలి' అని అన్నాడు.