ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో యువ సంచలనం లక్ష్యసేన్ దుమ్ములేపుతున్నాడు. అదిరే ఆట తీరుతో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. ప్రీక్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్కు చెందిన మూడో సీడ్ అండర్స్ అంటోన్సెన్పై సంచలన విజయం సాధించాడు. చేతికి గాయమైనప్పటికీ కట్టు కట్టుకుని మరి ఆడిన లక్ష్యసేన్ హోరాహోరిగా సాగిన పోరులో 21-16, 21-18తో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. తొలి సెట్ సగం ముగిసే సమయానికి 11-9తో అధిక్యంలో నిలిచిన లక్ష్యసేన్ చివరి వరకు అదే దూకుడును కొనసాగించి తొలి సెట్ను 21-16తో గెలుచుకున్నాడు. ఇక రెండో సెట్లో లక్ష్యసేన్, అండర్స్ అంటోన్సెన్ హోరాహోరిగా తలపడ్డారు. 14-14, 16-16తో స్కోర్ సమంగా నిలిచింది. ఈ దశలో సత్తా చాటిన లక్ష్యసేన్ 18-16తో అధిక్యంలొకి వచ్చాడు. చివరికి రెండో సెట్ (21-18) తోపాటు మ్యాచ్ను గెలుచుకున్నాడు. ఇక నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో లక్ష్యసేన్ చైనాకు చెందిన లు గ్వాంగ్ జుతో తలపడనున్నాడు.
ఇక తెలుగు క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో నిరాశపరిచారు. ఇద్దరు కూడా ప్రీక్వార్టర్ ఫైనల్లోనే ఓడి ఇంటి దారి పట్టారు. ఆరో సీడ్ సింధు 19-21, 21-16, 17-21తో జపాన్కు చెందిన సయాక టకహషి చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్ కోల్పోయిన సింధు, ఇంతలోనే పుంజుకుని రెండో సెట్ గెలుచుకుంది. కానీ కీలకమైన మూడో సెట్లో సయాక టకహషి ముందు తలవంచింది. దీంతో సింధు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అటు సీనియర్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సైతం ప్రీక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. 14-21, 21-17, 17-21 తేడాతో జపాన్కు చెందిన రెండో సీడ్ యమగూచి చేతిలో సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. తొలి సెట్లో ఓడినప్పటికీ, రెండో సెట్ కైవసం చేసుకున్న సైనా, కీలకమైన మూడో సెట్లో ఓడడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
డబుల్స్ విభాగంలో భారత జోడీలు సత్తా చాటాయి. ప్రిక్వార్టర్స్లో పుల్లెల గాయత్రీ-ట్రెసా జాలీ తొలి సెట్లో ఓడి, రెండో సెట్లో 18-21, 19-14 స్కోరు వద్ద అధిక్యంలో నిలిచిన సమయంలో ఆరో సీడ్ ప్రత్యర్థి జోడీ గ్రేసియా-అప్రియని (ఇండోనేసియా) గాయం కారణంగా రిటైర్ట్ హర్ట్గా వెనుదిరిగింది. దీంతో భారత జోడీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక పురుషుల డబుల్స్లో విభాగంలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి జోడీ 21-7, 21-7తో జర్మనీకి చెందిన మార్క్ లామ్స్ఫుజ్-మార్విన్ సీడెల్ జంటపై ఏకపక్ష విజయాన్ని అందుకుని క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ కేవలం 27 నిమిషాల్లోనే పూర్తవడం గమనార్హం.