హైదరాబాద్: మెరుపు వేగంతో మొదలైన సింధు పోరు చివరకి నిరుత్సాహానికి గురి కావాల్సి వచ్చింది. కీలక సమయంలో తడబడిన సింధు చివరికి ఓటమిపాలైంది. నిరుడు దుబాయ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్ పోరులో సింధును ఓడించిన యమగూచి మరోసారి ఆమెకు షాకిచ్చింది. సింధుతో 10 మ్యాచ్లు ఆడిన ఆమెకు ఇది నాలుగో విజయం మాత్రమే.
కడ వరకూ పోరాడినా: టోర్నీలో అలుపెరుగని పోరాటం చేస్తున్న సింధు సెమీస్ను మెరుపు వేగంతో ఆరంభించింది. వరుసగా 5 పాయింట్లు సాధించింది. ఆ తర్వాత యమగూచి కాస్త కోలుకున్నా సింధు పట్టువదల్లేదు. అటాకింగ్ గేమ్తో పాటు.. బ్యాక్హ్యాండ్, డ్రాప్ షాట్లతో ప్రత్యర్థిని పరీక్షించిన ఆమె.. 11-5తో విరామానికి వెళ్లింది. విరామం తర్వాత అదే జోరు కొనసాగించిన సింధు 16-8తో గేమ్ దిశగా సాగింది.
ఐతే గట్టి పోటీనిచ్చిన యమగూచి 14-17తో సింధుకు సవాల్ విసిరింది. ఆ తర్వాత సింధు అనవసర తప్పిదాలతో పాటు.. యమగూచి సుదీర్ఘ ర్యాలీని సొంతం చేసుకోవడంతో స్కోరు 17-17తో సమమైంది. కీలక సమయంలో సంయమనం ప్రదర్శించిన సింధు విజయాన్ని అందుకుంది. వరుసగా రెండు పాయింట్లు సాధించి 19-17తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె.. 21-19తో తొలి గేమ్ను ఖాతాలో వేసుకుంది. ఐతే రెండో గేమ్ నుంచి పోటీ మరింత తీవ్రమైంది.
ఆరంభం నుంచి ప్రతి పాయింటు కోసం ఇద్దరు నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డారు. 44 షాట్ల ర్యాలీలో విజయం సాధించిన యమగూచి 15-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమె అదే జోరు కొనసాగించి గేమ్ను దక్కించుకుంది. మూడో గేమ్లో పుంజుకున్న సింధు ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. 13-7తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె సులభంగానే గెలుస్తుందని అనిపించింది. ఐతే అప్పటికే అలసిపోయిన ఆమె అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ఆఖర్లో తడబడి యమగూచికి మ్యాచ్ సమర్పించుకుంది.
జియాంగ్ చేతిలో ప్రణయ్..: శుక్రవారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ఫైనల్లో ప్రణయ్ 22-20, 16-21, 21-23తో హుయాంగ్ జియాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు.