రెండు గ్రూపులుగా విడిపోయిన 8 జట్లు
తొలి వరల్డ్కప్ 1975లో జరిగింది. ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన మొదటి ప్రపంచకప్ రెండు వారాలపాటు 60 ఓవర్ల పద్దతిలో సాగింది. మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఈ టోర్నీలో ఆడాయి. గ్రూపులో ప్రతి జట్టు మరో టీంతో తలపడగా..రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో ప్రవేశించాయి.
గ్రూప్-బిలో భారత్
ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఈస్ట్ఆఫ్రికాతో కలిసి గ్రూప్-బిలో భారత్ బరిలోకి దిగింది. కెన్యా, ఉగాండా, టాంజానియా, నార్త్ రొడీషియా దేశాల క్రికెటర్లు ఈస్ట్ఆఫ్రికా జట్టు తరపున ఆడటం విశేషం. తొలి వరల్డ్కప్లో భారత జట్టుకు ఆఫ్స్పిన్నర్ శ్రీనివాస రాఘవన్ వెంకటరాఘవన్ కెప్టెన్గా వ్వవహారించాడు.
తొలి వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించిన భారత్
సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్, ఫరూఖ్ ఇంజనీర్, బిషన్సింగ్ బేడీలతో కూడిన భారత జట్టు తొలి వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించింది. తొలి వరల్డ్కప్లో టీమిండియా తొలి మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్తో తలపడింది. ఈ మ్యాచ్ ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జూన్ 7న జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది.
గవాస్కర్ బ్యాటింగ్పై విమర్శలు
తొలి వరల్డ్కప్ మ్యాచ్లో ఓపెనర్ గవాస్కర్ బ్యాటింగ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 60 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ నిర్దేశించిన 335 పరుగుల లక్ష్య చేధనలో 60 ఓవర్లూ ఆడిన గవాస్కర్ కేవలం 36 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్లో మొత్తం 174 బంతులాడి గవాస్కర్ ఒకే ఒక్క బౌండరీ బాదాడు. ఫలితంగా 60 ఓవర్లలో భారత్ 3 వికెట్లకు 132 పరుగులే చేసి 202 పరుగుల తేడాతో ఓడిపోయింది.