
హైదరాబాద్: ఏప్రిల్ 2, 2011... భారత క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యకమైన రోజు. ఆరోజుకు ఉన్న ప్రత్యేకం ఏంటని ఆలోచిస్తున్నారా? సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం 2011లో ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే మైదానంలో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని టీమిండియా రెండోసారి వన్డే వరల్డ్ కప్ టోర్నీని కైవసం చేసుకుంది.
వాంఖడే మైదానంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు మహేల జయవర్ధనే (103 నాటౌట్: 88 బంతుల్లో 13 ఫోర్లు) రాణించడంతో నిర్ణతీ 50 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. అనంతరం 275 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది.
ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను మలింగ డకౌట్గా పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ (18) పరుగుల వ్కక్తిగత స్కోరు వద్ద మలింగ బౌలింగ్లో వికెట్ కీపర్ కుమార సంగక్కరకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన గౌతం గంభీర్ (97: 122 బంతుల్లో 9 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. తన అద్భుతమైన ఇన్నింగ్స్తో భారత్ను ఆదుకున్నాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ (35) పరుగుల వద్ద దిల్షాన్ బౌలింగ్లో కాట్ అండ్ బౌల్డ్గా పెవిలియన్కు చేరాడు.
కోహ్లీ ఔటైన తర్వాత యువరాజ్ సింగ్ క్రీజులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ధోని బరిలోకి దిగాడు. గంభీర్తో కలిసి ధోనీ దూకుడు మొదలుపెట్టాడు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో గంభీర్ (97) పరుగుల వద్ద పెరీరా బౌలింగ్లో ఔటయ్యాడు.
గంభీర్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ (21 నాటౌట్) సహకారంతో ధోని (91 నాటౌట్: 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) వీర విహారం చేశాడు. దీంతో భారత్ విజయానికి నాలుగు పరుగులు కావాల్సి ఉంది. స్టేడియంలో అభిమానుల కేరింతలు, సందడి మధ్య 49వ ఓవర్ మొదలైంది.
తొలి బంతిని ఎదుర్కొన్న యువరాజ్ సింగ్ సింగిల్ తీసి ధోనీకి స్ట్రైకింగ్ ఇచ్చాడు. కులశేఖర వేసిన రెండో బంతిని ఎదుర్కొన్న ధోని దానిని భారీ సిక్సర్గా మలిచి భారత్కు వరల్డ్ కప్ అందించాడు. ఆ సిక్సర్ మాత్రం భారతీయుల గుండెల్లో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది.
ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. దీంతో రెండోసారి వరల్డ్ కప్ గెలవాలన్న భారత అభిమానుల 28 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 2011లో రెండోసారి ధోని నేతృత్వంలోని టీమిండియా వరల్డ్ కప్ను నెగ్గడంతో అప్పటి జట్టులో ఉన్న ఆటగాళ్లు ఆ చిరస్మరణీయ విజయాన్ని మరోసారి సోషల్ మీడియాలో గుర్తు చేసుకుంటున్నారు.