కొంతకాలం క్రితం వరకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ లేక తంటాలు పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అతను సెంచరీలు మాత్రమే చేయలేదు. కానీ ఎన్నో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అయినా సరే కోహ్లీపై అందరూ విమర్శలు చేశారు. అసలు అతను జట్టులో అవసరమా? అని ప్రశ్నించిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కానీ రోహిత్ శర్మ అలాక్కాదు. అతను ఫామ్లో ఉన్నట్లే కనిపిస్తాడు. కానీ భారీ స్కోర్లు మాత్రం చేయడం లేదు.
బంగ్లాదేశ్ వన్డే సిరీస్లో బొటనవేలి గాయంతో ఆటకు దూరమైన రోహిత్.. కొత్త సంవత్సరాన్ని బాగానే ఆరంభించాడు. లంకతో జరిగిన తొలి వన్డేలో 80 పరుగులతో రాణించాడు. ఆ మ్యాచ్ను భారత జట్టు 67 పరుగుల తేడాతో గెలిచింది. రెండో వన్డేలో విఫలమైన రోహిత్.. మూడో వన్డేలో తనకు దక్కిన శుభారంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తొందరపడి పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో అతని గురించి ఒక షాకింగ్ స్టాట్ బయటకు వచ్చింది. అది చూసిన మాజీ లెజెండ్ గౌతమ్ గంభీర్ కూడా షాకైపోయాడు.
రోహిత్ తను ఆడిన చివరి 50 అంతర్జాతీయ ఇన్నింగ్స్లలో ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇది చూసిన గంభీర్ ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో కోహ్లీపై వచ్చిన విమర్శలను గుర్తుచేస్తూ.. రోహిత్ను కూడా కోహ్లీ స్థానంలో ఉంచాలని, అతన్ని కూడా విమర్శించాలని స్పష్టం చేశాడు. రోహిత్ ఇన్ని ఇన్నింగ్స్లలో సెంచరీ చేయలేదనే విషయమే తాను గమనించలేదన్న గంభీర్.. వీళ్లిద్దరూ భారీ స్కోర్లు చేయగలిగే ఆటగాళ్లేననే విషయం మర్చిపోవద్దన్నాడు. అయితే ఆరంభాన్ని సెంచరీగా మలచడంలో విఫలం అవుతూ వచ్చిన కోహ్లీ మళ్లీ గాడిలో పడ్డాడని, కానీ రోహిత్ ఇంకా అక్కడి వరకు రాలేదని చెప్పాడు. వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే వీళ్లిద్దరూ రాణించడం చాలా ముఖ్యం అని చెప్పాడు.