ఇంకొన్ని వికెట్లు పడుంటే బాగుండేదని
ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం శుక్రవారం భారత్ వికెట్లు ఇంకా పడి ఉంటే బాగుండేదని ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అభిప్రాయపడ్డాడు. ‘మెల్బోర్న్లో మరింత ఆత్మవిశ్వాసంతో క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. శుక్రవారమే ఇంకొన్ని వికెట్లు పడుంటే బాగుండేదని నాకు అనిపించింది. శనివారం తొలి సెషన్లో మరికొన్ని పరుగులు జోడించి.. ఆ తర్వాత ఆస్ట్రేలియాని ఆలౌట్ చేసేందుకు ఉపక్రమిస్తాం' అని జస్ప్రీత్ బుమ్రా వెల్లడించాడు.
300పైచిలుకు లక్ష్యం ఛేదించడం కష్టతరమే
పిచ్ బౌలింగ్కి అతిగా అనుకూలిస్తున్న నేపథ్యంలో.. 300పైచిలుకు లక్ష్యం ఛేదించడం కష్టతరమే. ఈ నేపథ్యంలోనే.. ఇప్పటికే 346 ఆధిక్యంలో ఉన్న భారత్ వేగంగా ఆలౌట్ అయితే.. రెండో ఇన్నింగ్స్లోనూ కంగారూలను బెంబేలెత్తించొచ్చని బుమ్రా అంచనాలు అయి ఉండొచ్చు. మరో పక్క కోహ్లీ రెండో ఇన్నింగ్స్ ఆరంభించకుండా ఫాలో ఆన్ ఆడించినా సరిపోయేదంటూ కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
డకౌట్గా వెనుదిరిగిన కోహ్లీ.. పూజారాలు
292 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా టాపార్డర్ సైతం నిమిషాల వ్యవధిలో కుప్పకూలింది. ఇందులో గమనార్హంగా కోహ్లీ నాలుగు బంతులు ఆడి డకౌట్గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్ ఏకంగా 300కు పైగా బంతులాడి 106పరుగులు చేసిన పూజారా సైతం సున్నా పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఇలా మొదటి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే 5 కీలక వికెట్లను కోల్పోయింది.
346 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
ఆస్ట్రేలియా బౌలర్ కమ్మిన్స్ పిచ్ అనుకూలిస్తున్న నేపథ్యంలో 32 పరుగులకే 4 టాపార్డర్ వికెట్లను చేజిక్కించుకున్నాడు. అనూహ్యంగా 4 వికెట్లూ కమ్మిన్స్ ఖాతాలోకే చేరాయి. కమ్మిన్స్ ధాటికి హనుమ విహారి (13), పుజారా (0), కోహ్లీ (0), రహానే (1) స్వల్ప స్కోర్లకే పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత బరిలోకి దిగిన రోహిత్(5) హేజిల్ వుడ్ బౌలింగ్లో షాన్ మార్ష్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇలా భారత్ ప్రస్తుతం 27 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 54 పరుగులుచేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (25 నాటౌట్), రిషబ్ పంత్(6) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 151 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో భారత్ ప్రస్తుతం 346 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.