గ్రేటెస్ట్ మ్యాచ్ విన్నర్ ఎవరో తెలుసా?
భారత క్రికెట్ యొక్క గోల్డెన్ ఎరాలో "గ్రేటెస్ట్ మ్యాచ్ విన్నర్?" అనే చర్చ ఎప్పటికప్పుడు క్రికెట్ అభిమానులకు ఆలోజింపచేస్తూనే ఉంటుంది. కొందరేమో సచిన్ టెండూల్కర్ అని, మరికొందరేమో సౌరవ్ గంగూలీ అని పేర్కొంటారు. అయితే, మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ప్రకారం "గ్రేటెస్ట్ మ్యాచ్ విన్నర్?" ఎవరో తెలుసా అనిల్ కుంబ్లే.
లక్ష్మణ్ మాట్లాడుతూ
లక్ష్మణ్ మాట్లాడుతూ "నా ప్రియమైన స్నేహితుడు అనిల్ కుంబ్లే బహుశా భారతదేశపు గ్రేటెస్ట్ మ్యాచ్ విన్నర్... నేను ఆడిన అతిపెద్ద మ్యాచ్ విజేత" అని పేర్కొన్నాడు. వెరీ వెరీ స్పెషల్ స్టోరీస్లో తాను అనిల్ కుంబ్లేని "గ్రేటెస్ట్ మ్యాచ్ విన్నర్?"గా ఎందుకు పేర్కొన్నాడో వీవీఎస్ లక్ష్మణ్ వివరించాడు. 1995లో ఈ ఇద్దరు క్రికెటర్లు పాల్గొన్న ఒక ఆసక్తికరమైన సంఘటనను ఈ సందర్భంగా వెల్లడించాడు.
లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ఆరోజు
"ఇదొక చెడ్డ జ్ఞాపకం. నేను హైదరాబాద్ తరుపున బాగా ఆడాను. దీంతో ఛాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా అండర్-19 ఇండియా బి జట్టుకు ఎంపికయ్యాను. లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. బంతి నా ప్యాడ్కు తగిలిన శబ్దాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఒక లెగ్గీకి వ్యతిరేకంగా బ్యాక్ఫుట్ తీసుకుని స్కేర్ లెగ్లో కొట్టడానికి ప్రయత్నించాను. మునుపటి బంతిని నేను అలా ఆడాను. కానీ, ఆ తదుపరి బంతి నేను బ్యాట్ లేపడానికి ముందే నా ప్యాడ్లో చిక్కుకుంది. అంత త్వరగా బంతిని సంధించాడు అనిల్" అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.
కుంబ్లే మాట్లాడుతూ
అనంతరం అనిల్ కుంబ్లే మాట్లాడుతూ "నేను నీ గురించి విన్నాను. నువ్వు బ్యాక్ఫుట్ ప్లేయర్ అని నాకు తెలుసు. బహుశా నేను ప్లేయర్ను సెటప్ చేయడానికి ఆ విధంగా బౌలింగ్ చేశాను. నేను ఆ రోజు అదృష్టవంతుడిని. ఆ మ్యాచ్ తర్వాత నీ వద్దకు వచ్చి నా బౌలింగ్లో నీకు బ్యాక్ పుట్ ఆడొద్దని చెప్పడం నాకు గుర్తుంది" అని తెలిపాడు. అండర్-19 జట్టుకు ఆడిన వీరిద్దరూ ఆ తర్వాత ప్రపంచ క్రికెట్ను ఏ విధంగా శాసించారో మనకు తెలిసిందే.
ఐపీఎల్ వేలంలో బిజీ బిజీగా
ఆస్ట్రేలియన్ బౌలర్లకు వీవీఎస్ లక్ష్మణ్ సింహాస్వప్నంగా నిలవగా... టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్లో పది వికెట్లు తీసిన భారత బౌలర్గా అనిల్ కుంబ్లే చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లేలు వచ్చే నెలలో కోల్కతా వేదికగా జరగనున్న ఐపీఎల్ వేలానికి సన్నద్దమవుతున్నారు. లక్ష్మణ్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటార్గా ఉండగా... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కోచ్గా కుంబ్లే ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు.