|
ధోని క్రికెట్ భవిష్యత్పై విరాట్ కోహ్లీ
ధోని క్రికెట్ భవిష్యత్తో పాటు టీమిండియా గురించి విరాట్ కోహ్లీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘బయటి వ్యక్తుల మాదిరిగా ఆలోచించినా, వారిలా మాట్లాడినా భారత క్రికెట్ కచ్చితంగా సమస్యలో పడుతుంది. లేని సమస్యలు ఉన్నట్టుగా సృష్టించే అద్భుత ప్రపంచం ఇది. భారత జట్టు బాగా రాణిస్తూ సాఫీగా సాగుతున్నప్పుడు ప్రజలు జట్టులో ఒక్కసారిగా సంఘర్షణను కోరుకుంటారు' అని చెప్పాడు.
ఎవరేమన్నా తాము పట్టించుకోం
అయితే తమ గురించి బయట వారు ఎవరేమన్నా తాము పట్టించుకోమని స్పష్టం చేశాడు. జట్టు ఆటతీరు ప్రకారం తరచూ మారే వారి అభిప్రాయాలకు విలువ లేదని కోహ్లీ చెప్పాడు. ‘మేం ఓడిపోయినప్పుడు నాన్ స్టాఫ్గా డిబేట్లు నిర్వహిస్తారు. అదే గెలిచినప్పుడు ఒకటి రెండు వార్తలతో సరిపెడతారు. అందువల్ల బయటి వ్యక్తులు మా గురించి ఏ మాట్లాడుతున్నారు, ఏం రాస్తున్నారన్నది మాకు అనవసరం. ఒక జట్టుగా ఎటువైపు పయనిస్తున్నామన్నదానిపై స్పష్టత ఉంది. ప్రస్తుతం మేం చాలా సౌకర్యవంతంగా ఉన్నాం' అని కోహ్లీ చెప్పాడు.
ఆరెంజ్ క్యాప్ని సొంతం చేసుకున్న కోహ్లీ
ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ 11వ సీజన్లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అంతేకాదు అత్యధిక పరుగులు సాధించే ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ను సైతం సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కోహ్లీ ఇప్పటి వరకు 5,043 పరుగులు నమోదు చేశాడు.
5వేలకు పైగా పరుగులు చేసిన తొలి క్రికెటర్
ఐపీఎల్, ఛాంపియన్ లీగ్ టీ20 కలిపి 5వేలకు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభం నుంచీ కోహ్లీ బెంగళూరు జట్టుకే ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. తద్వారా ఒకే ప్రాంఛైజీ తరుపున అత్యధిక పరుగుల సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.