పాటలు పాడనున్న కోహ్లీ, రోహిత్:
'ఐ ఫర్ ఇండియా' చేపడుతున్న ఈ కార్యక్రమంలో నటులు, సంగీత దర్శకులు, గాయకులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు పాల్గొననున్నారు. ఆన్లైన్ సంగీత విభావరిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భాగస్వాములు కానున్నారు. అందరూ తమ ఇంటి దగ్గరి నుంచే ప్రజలను ఎంటర్టైన్ చేయనున్నారు. దీని ద్వారా నిధులను సమీకరించనున్నారు. ఈ నిధులను వైరస్పై యుద్ధం చేసేందుకు, లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి ఉపయోగించనున్నారు.
సంగీత విభావరిలో ఐశ్వర్య రాయ్:
ఈ సంగీత విభావరిలో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, ఏఆర్ రెహ్మాన్, జాకీర్ హుసేన్, ఆమిర్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖుర్రానా, బ్రయాన్ ఆడమ్స్, గుల్జార్, నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా జోనాస్ సింగ్, శ్రేయా ఘోషల్, సోను నిగమ్, సోఫీ టర్నర్, జోయా అక్తర్, విద్యా బాలన్, ఆలియా భట్తో పాటు పలువురు నటులు, గాయకులు, సంగీత దర్శకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆన్ద్వారా భాగస్వాములవనున్నారు. అందరూ తమ పాటలతో అభిమానులను అలరించనున్నారు.
ప్రజలను ఎంటర్టైన్ చేసేందుకు:
'లాక్డౌన్లో ఉన్న ప్రజలను ఎంటర్టైన్ చేసేందుకు, కరోనా మహమ్మారిపై యుద్ధంలో ముందుడి పోరాటం చేస్తున్న వారికోసం, ఉపాధి లేక ఇంట్లో ఇబ్బందులు పడుతున్న వారి కోసం.. నిధులు సేకరించేందుకు భారత అతిపెద్ద సంగీత విభావరి నిర్వహించే పనిని రెండు వారాల క్రితం ప్రారంభించాం' అని ఐ ఫర్ ఇండియా ప్రకటించింది.
హర్హల్ గిబ్స్ కూడా:
ఇప్పటికే ఎందరో క్రికెటర్లు తమ వంతు సాయం ప్రకటించగా.. మరికొందరు క్రికెట్ కిట్స్, బ్యాట్, జెర్సీలను వేలానికి ఉంచారు. తాజాగా కరోనాపై పోరుకు తన వన్డే కెరీర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్ను వేలంలో పెడుతున్నట్లు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హర్హల్ గిబ్స్ ప్రకటించారు .2006లో జొహెన్నెస్బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో 434 భారీ లక్ష్యాన్ని చేధించడంలో.. గిబ్స్ కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో తాను 111 బంతుల్లో 175 పరుగులు చేసి జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఇప్పుడు కరోనాపై జరుగుతున్న పోరులో తన వొంతు సహాయాన్ని అందించేందుకు గిబ్స్ ముందుకొచ్చారు.