లండన్: ఐదు టెస్ట్ సిరీసులో భాగంగా ఇంగ్లండ్తో జరగాల్సిన చివరి టెస్టు మ్యాచ్ రద్దు కావడానికి దారితీసిన పరిస్థితులపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరైన వివరణ ఇవ్వాలని ఇంగ్లీష్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ అన్నాడు. కోహ్లీ వివరణ ఇవ్వకపోతే.. మరిన్ని అనుమానాలకు తావిస్తుందని పేర్కొన్నాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య సెప్టెంబర్ 10న ఆరంభం అవ్వాల్సిన చివరి టెస్టు అనూహ్యంగా రద్దయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9న జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్కి కరోనా పాజిటివ్గా తేలింది. ఆపై భారత క్రికెటర్లందరి కోవిడ్ రిపోర్టులు నెగెటివ్గా వచ్చినా.. మ్యాచ్ మధ్యలో ఏదైనా జరగవచ్చనే భయమే టీమిండియా ఆటగాళ్లను బరిలోకి దిగకుండా చేసింది.
ఐదో టెస్ట్ రద్దుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ స్పందించాడు. 'ఇంతకు ముందు కూడా మ్యాచులు రద్దు అయ్యాయి. అయితే ఈ మ్యాచ్ రద్దవ్వడానికి ముందు రోజు అర్ధరాత్రి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐకి లేఖ రాశాడు. కాబట్టి మ్యాచ్ రద్దవ్వడానికి దారి తీసిన పరిస్థితులపై అతడు వివరణ ఇస్తే బాగుంటుంది. లేదంటే మరిన్ని అనుమానాలకు తావిస్తుందని నేను భావిస్తున్నా. ఒకవేళ ఐపీఎల్ 2021 కారణంగానే ఈ మ్యాచ్ను రద్దు చేసి ఉంటే.. నాలాంటి టెస్టు క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేసినట్లే. ఎందుకంటే గతంలో టెస్టు క్రికెట్ ఎంత ముఖ్యమో కోహ్లీ చెప్పాడు' అని గోవర్ అన్నాడు.
IPL New Team: అక్టోబర్ 17న వేలం.. లక్నో జట్టుపై కన్నేసిన బడా బిజినెస్ మేన్!!
ఐదో టెస్టు రద్దయిన అనంతరం ఐపీఎల్ 2021 కోసం దుబాయ్ చేరుకున్న విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ బోల్డ్ డైరీస్లో మాట్లాడాడు. 'ఐపీఎల్ కోసం త్వరగా దుబాయ్ చేరుకోవడం దురదృష్టకరం. కానీ కరోనా వల్ల అనిశ్చితి ఎక్కువగా ఉంది. ఏ సమయంలో ఏదైనా జరగొచ్చు. ఐపీఎల్లో బయో బబుల్ అత్యంత సురక్షితంగా ఉంటుందని, నాణ్యమైన టోర్నీని చూస్తామని ఆశిస్తున్నా' అని కోహ్లీ చెప్పాడు. నాలుగో టెస్టు సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఓవల్లోని హోటల్లో బసచేస్తుండగా.. తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయిన విషయం తెలిసిందే. అతడి వెంట కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వెళ్లాడు. ఆ కార్యక్రమం అనంతరం రవిశాస్త్రికి కరోనా పాజిటివ్గా తేలింది. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్లకు వైరస్ సోకింది. అనంతరం టీమ్ ఫిజియో నితిన్ పటేల్ కూడా కరోనా బారిన పడ్డాడు. చివరకు జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్కి కరోనా పాజిటివ్గా తేలింది.
ఐపీఎల్ 2021 కారణంగానే చివరి టెస్టును రద్దు చేశారని వస్తున్న వార్తలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొట్టి పారేశాడు. 'బీసీసీఐ బాధ్యతారహితమైన బోర్డు కాదు. ఇతర బోర్డులను ఎప్పుడూ గౌరవిస్తుంది. ఎవరికీ నష్టం వాటిల్లే విధంగా బీసీసీఐ వ్యవహరించదు' అని గంగూలీ అన్నాడు. 'ఐదో టెస్ట్ మ్యాచ్ ఆడడానికి ప్లేయర్స్ నిరాకరించారు. కానీ వాళ్లను కూడా ఈ విషయంలో నిందించలేం. ఫిజియో యోగేశ్ పార్మర్ అప్పటికే ప్లేయర్స్తో టచ్లో ఉన్నాడు. నితిన్ పటేల్ కూడా ఐసోలేషన్లోకి వెళ్లిన తర్వాత యోగేశ్ ఒక్కడే సహాయ బృందంలో మిగిలిపోయాడు. యోగేశ్ ప్రతి రోజూ ఆటగాళ్లకు మసాజ్ చేసేవాడు. అతనికి కరోనా సోకిందని తెలియగానే.. ప్లేయర్స్ అందరూ ఆందోళనకు గురయ్యారు. తమకూ కరోనా సోకుతుందని భయపడ్డారు' అని స్పష్టం చేశాడు.