హైదరాబాద్: శ్రీలంక పర్యటనలో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసేందుకు గాను తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తమిళనాడు ఆల్రౌండర్ విజయ్ శంకర్ అన్నాడు. శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా మార్చి 6 నుంచి 15 వరకు శ్రీలంక వేదికగా నిదాహాస్ ట్రోఫీ పేరిట ముక్కోణపు టీ20 సిరిస్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాదిలో టీమిండియా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలు ఉన్న నేపథ్యంలో పాండ్యాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చి అతడి స్థానంలో దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న విజయ్ను జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పాండ్యా స్థానంలో బ్యాకప్ ఆల్ రౌండర్గా విజయ్ శంకర్ను తయారు చేయాలనే ఉద్దేశంతో జట్టు మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా విజయ్ శంకర్ మాట్లాడుతూ 'నేను పోలికలకు ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. మైదానంలో అడుగుపెట్టే సారీ ఒత్తిడి ఉంటుంది. ప్రతి చోటా ఆడినట్టే ప్రశాంతంగా ఆడితే సరిపోతుంది. ప్రతి క్రికెటర్ దేశానికి ప్రాతినిధ్యం వహించి ఎంతో కొంత ఇవ్వాలని కోరుకుంటాడు. మేం అందరి నుంచీ నేర్చుకుంటాం' అని అన్నాడు.
'పోలికతో సంబంధం లేదు. నేను దేశవాళీ క్రికెట్కు చాలా ప్రాధాన్యం ఇస్తాను. అక్కడ బాగా రాణిస్తేనే ఆ తర్వాతి అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రస్తుతం నా దృష్టంతా ముక్కోణపు సిరీస్పైనే ఉంది. అంతర్జాతీయ స్థాయి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు నాకొచ్చిన అవకాశం ఇది' అని విజయ్ శంకర్ తెలిపాడు.
'ఎక్కువగా ఆట గురించే ఆలోచిస్తాను తప్ప ఒత్తిడి గురించి కాదు. వరల్డ్ కప్ గురించి ఆలోచించడం లేదు. మైదానంలో సీనియర్ల నుంచి నేర్చుకోవడానికే ప్రాముఖ్యం ఇస్తాను. ఆటకు మానసికంగా సన్నద్ధం అవ్వడమే కీలకం. ప్రత్యేక శ్రద్ధతో నేను ఆటను గమనిస్తూ పరిస్థితులకు తగ్గట్టు ఆడేందుకు ప్రయత్నిస్తాను' అని శంకర్ పేర్కొన్నాడు.
జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో విజయ్ శంకర్ను ఢిల్లీ డేర్డెవిల్స్ రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది దేశవాళీ క్రికెట్లో విజయ్ శంకర్ నిలకడగా రాణించాడు.