హైదరాబాద్: బీసీసీఐ ఆఫీస్ బేరర్లు ఇకపై వరుసగా రెండు సార్లు పదవులు చేపట్టవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ స్వాగతించారు. బీసీసీఐ ఆమోదించిన కొత్త నిబంధనావళికి సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించడంపై ఆయన మాట్లాడారు.
దేశంలో క్రికెట్ ప్రక్షాళనకు లోధా కమిటీ చేసిన సూచనలను అమలు చేసేందుకు ఇప్పుడు మార్గం సుగమమైందని ఆయన అన్నారు. బోర్డు కార్యవర్గ సభ్యులుగా ఎవరైన వరుసగా రెండుసార్లు ఎన్నికైతే, చివరిదైన మూడో టెర్మ్ ఆరంభానికి ముందు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవడానికి ఉద్దేశించిన 'కూలింగ్ ఆఫ్' పీరియడ్ అమలు కావడం గొప్ప పరిణామమని అన్నారు.
లోధా కమిటీ అసలు సిఫార్సుల ప్రకారం ఒకసారి పదవీకాలం పూర్తికాగానే మూడేళ్లు విరామం (కూలింగ్ ఆఫ్ పిరియడ్) తప్పనిసరి. గురువారం సుప్రీం ఇచ్చిన ఆదేశాల ప్రకారం అభ్యర్థులు రెండు సార్లు వరుసగా పోటీ చేయవచ్చు. దీనిపై వినోద్ రాయ్ మాట్లాడుతూ లోధా సిఫార్సుల్లో మొదటి టెర్మ్ పూర్తయిన వెంటనే 'కూలింగ్ ఆఫ్' మొదలుకావాలని ఉందని, అయితే, రెండో టెర్మ్ తర్వాత దానిని అమలు చేయడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని అన్నారు.
నిజానికి తాను కూడా రెండో టెర్మ్ పూర్తయిన తర్వాత 'కూలింగ్' పీరియడ్ ఉండాలని అభిప్రాయపడినట్టు తెలిపాడు. అయితే, అప్పట్లో తన ప్రతిపాదనపై ఏకాభిప్రాయం కుదరలేదని అన్నారు. "గౌరవ కోర్టు ఇచ్చిన ఆదేశం చాలా బాగుంది. ఆఫీస్ బేరర్లు రెండుసార్లు వరుసగా పనిచేసేందుకు నాకెలాంటి అభ్యంతరం లేదు. విరామం ముందు పదవీకాలం ఆరేళ్లుండాలని నేను ఇంతకు ముందే ప్రతిపాదించాను. అయితే ఏకాభిప్రాయం కుదరలేదు" అని రాయ్ తెలిపారు.
బీసీసీఐ నూతన రాజ్యాంగం అమలుకు టైమ్లైన్ను ఏర్పాటు చేయడం సుప్రీం కోర్టు నుంచి వచ్చిన మరొక సానుకూల ఆదేశమని రాయ్ పేర్కొన్నారు. బీసీసీఐ కొత్త నిబంధనావళిని ఆమోదించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని సభ్య సంఘాలకు సుప్రీం కోర్టు హెచ్చరికలు జారీ చేయడంపై సీఓఏ చీఫ్ ఆనందం వ్యక్తం చేశాడు.
"లోధా కమిటీ సిఫార్సులను బీసీసీఐ, దాని సభ్య సంఘాలు అమలు చేసే విషయంలో ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవడానికి మార్గం మరింత సులభమైంది" అని అన్నారు. రైల్వేస్, సర్వీసెస్, యూనివర్సిటీస్కి సుప్రీం శాశ్వత సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించింది. ముంబయి, సౌరాష్ట్ర, వడోదర, విదర్భ సంఘాలకు ఓటు హక్కు కల్పించింది.
"ముంబై వంటి సంఘాలకు ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించి వాటి వారసత్వానికి కొనసాగించాలని కోరుకుంటున్నాం. రాజ్యాంగ ముసాయిదా సైతం దీనిని ప్రతిపాదించింది. బీసీసీఐ ప్రతి అనుబంధ సంఘానికి ఓటింగ్ హక్కులుంటాయి. కోర్టు తీర్పు ప్రకారం సంఘాలన్నీ రాజ్యాంగాన్ని అమలు చేయాలి. అలా చేయని పక్షంలో తాము కోర్టును ఆశ్రయిస్తాం" అని రాయ్ తెలిపారు.
సీఓఏ సభ్యురాలు, భారత మాజీ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీ కూడా సుప్రీం కోర్టు ఆదేశాలను స్వాగతించింది. ఈ తీర్పు ఎంతో సంతృప్తికరంగా ఉందని వ్యాఖ్యానించింది. లోధా కమిటీ సిఫార్సులను బీసీసీఐ, దాని అనుబంధ సంఘాలతో అమలు చేయించడమే తమకు కేటాయించిన బాధ్యతని ఆమె గుర్తుచేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో తమ పని సులభమవుతుందని చెప్పింది. భారత క్రికెట్కు ఈ తీర్పు కొత్త దిశానిర్దేశనం చేస్తుందని అభిప్రాయపడింది.