హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్లో ఆసీస్ బోణీ చేసింది. బెంగళూరు వేదికగా భారత్తో జరిగిన నాలుగో వన్డేను ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 335 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా బ్యాట్స్మెన్ గందరగోళానికి గురయ్యారు. అది 23వ ఓవర్. బౌలర్ రిచర్డ్సన్. అప్పటికే భారత్ స్కోరు వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. అతడికి తోడుగా క్రీజులో కోహ్లీ ఉన్నాడు.
భారత్ కూడా మంచి రన్ రేట్తో సాగుతోంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 335 పరుగుల విజయ లక్ష్యం పెద్ద కష్టమనిపించలేదు. అయితే ఇక్కడే అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. భారత్కు ఊహించని షాక్ తగిలింది. కోహ్లీతో సమన్వయం కొరవడి రోహిత్ శర్మ అనవసరంగా రనౌట్ కావడం ఆసీస్కు కలిసొచ్చింది.

కేన్ రిచర్డ్సన్ వేసిన 22.6వ బంతిని కోహ్లీ స్లిప్లోకి తరలించాడు. వేగంగా వెళ్తున్న బంతిని ఫీల్డర్ స్మిత్ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఇంతలోనే కోహ్లీ కొద్ది దూరం పరుగెత్తి మళ్లీ తన ఎండ్కు వచ్చాడు. అయితే అవతలి నుంచి రోహిత్ శర్మ అలాగే పరుగెత్తుకుంటూ వచ్చాడు.
స్మిత్ స్ట్రైకర్ ఎండ్లో స్టంప్స్కు బంతిని విసరగా.. గురి తప్పింది. కానీ రోహిత్, కోహ్లీ ఒకే ఎండ్లో ఉన్నారు. రోహిత్ తిరిగి ఆవలిపైపు ఉరికినప్పటికీ అప్పటికే బాగా ఆలస్యమైపోయింది. స్మిత్ త్రో ఆపిన హెడ్.. బౌలర్కు ఇవ్వగా, అతడు బెయిల్స్ పడగొట్టాడు. దీంతో రోహిత్ శర్మ (65) అవుటయ్యాడు.
ఈ మలుపు నాలుగో వన్డేలో ఆసీస్కు కలిసొచ్చింది. 2013లో ఇదే చిన్నస్వామి మైదానంలోనే ఇలాగే జరిగింది. కానీ అప్పుడు విరాట్ కోహ్లీ రనౌటయ్యాడు. అయితే ఈ రనౌట్పై సోషల్ మీడియాలో అభిమానులు కోహ్లీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.