ఫీల్డింగ్లో యాక్సిడెంట్
అప్పటికి విరాట్ కోహ్లీ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఫీల్డర్లు లేని ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడకే బంతిని పంపడం అతని స్పెషాల్టీ కదా. ఈ క్రమంలోనే బౌలర్ వేసిన బంతిని స్వ్కేర్ లెగ్ బౌండరీ దిశగా పంపించాడు. టక టకా రెండు పరుగులు తీయాలనేది కోహ్లీ ప్లాన్. అయితే ఈ బంతి బౌండరీ వెళ్లకుండా ఆపేందుకు లంక ఆటగాళ్లు వాండర్సే, బండారా ఇద్దరూ చెరో వైపు నుంచి దూసుకొచ్చారు. బంతిపై పూర్తి ఫోకస్ పెట్టడంతో ఒకరిని ఒకరు చూసుకోని వాళ్లు.. ఒకేసారి డైవ్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ బలంగా ఢీకొట్టుకోవడంతో స్ట్రెచర్లపై మైదానం వీడాల్సి వచ్చింది. ఈ ఘటన చూసిన ప్రేక్షకులు ఎవరూ సీట్లలో కూర్చోలేదు. వాళ్లిద్దరికీ ఏమైందనే ఆందోళనతో అంతా లేచి నిలబడి ఆందోళనగా చూస్తుండిపోయారు.
కోహ్లీ హెలికాప్టర్ షాట్
ఈ వన్డేలో అందరిని అలరించిన ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆరంభం నుంచి చాలా చక్కగా తన ఇన్నింగ్స్ నిర్మించిన అతను.. సెంచరీ చేసిన తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 110 బంతుల్లోనే 166 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతేకాదు తన కెరీర్లో ఏ మ్యాచ్లోనూ కొట్టనట్లు ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 8 భారీ సిక్సర్లు బాదాడు. వాటిలో అతను రజిత వేసిన బంతిని కొట్టిన సిక్సర్ ఏకంగా 97 మీటర్ల దూరం వెళ్లింది. కోహ్లీ ఈ షాట్ కొట్టడం చూసిన అభిమానులు ఎవరూ సీట్లలో కూర్చోలేకపోయారు. ఉత్సాహంతో కేకలు వేస్తూ గంతులు వేశారు. ఎందుకంటే కోహ్లీ కొట్టిన షాట్.. ఎంఎస్ ధోనీ కొట్టే హెలికాప్టర్ షాట్లా కనిపించింది. కోహ్లీ కూడా తను ఆ షాట్ కొట్టడం చూసి ఆశ్చర్యపోయాడు.
సిరాజ్తో పరాచికాలా?
టీమిండియాలో ఎగ్రెసివ్గా ఆడే వాళ్లలో సిరాజ్ ఒకడు. తను ఆడే ప్రతి మ్యాచ్లోనూ నూటికి నూరు శాతం శ్రమించే అతను.. స్లెడ్జింగ్లో కూడా వెనక్కు తగ్గడు. బ్యాటర్లు తనను కవ్విస్తూ చూస్తూ ఊరుకోడు. అలాగే ఇటీవలి కాలంలో వైట్బాల్ క్రికెట్లో మంచి పరిణితి సాధించిన అతను మూడో వన్డేలో కూడా నిప్పులు చెరిగాడు. లంక కీలక బ్యాటర్లు అందరినీ వరుసపెట్టి పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన చమిక కరుణరత్నే.. సిరాజ్ను కవ్వించాడు. దీనికి దీటుగా బదులిచ్చిన సిరాజ్ మళ్లీ బౌలింగ్ చేయడానికి వెళ్లిపోయాడు. అతను వేసిన బంతిని డిఫెండ్ చేసుకున్న కరుణరత్నే.. దాన్ని సిరాజ్ వైపుగా పంపాడు. ఆ తర్వాత తర పోజ్ అలాగే ఉంచి నిలబడ్డాడు. అయితే అప్పటికే అతను క్రీజు దాటి ముందుకు వచ్చేశాడు. దాన్ని గమనించిన సిరాజ్.. బంతి తన చేతుల్లోకి రాగానే వికెట్ల వైపు డైరెక్ట్ త్రో విసిరాడు. రిప్లేలో కరుణరత్నే క్రీజు అవతలే ఉన్నట్లు తేలడంతో అంపైర్ అవుటిచ్చాడు. ఇది చూసిన అభిమానులు సిరాజ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చూసి షాకైపోయారు. అతన్ని మెచ్చుకుంటూ గంతులేశారు.