సువర్ణావకాశం... ఆసీస్ గడ్డపై ఓపెనర్లు ఆటే ఎంతో కీలకం: సచిన్

హైదరాబాద్: గత 40 ఏళ్లుగా ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్తూనే ఉంది. అయితే, ఒక్కసారి కూడా టెస్టు సిరిస్ను గెలవలేదు. అయితే, ఈసారి ఆస్ట్రేలియా జట్టు బలహీనంగా కనిపిస్తుండటంతో అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇరు జట్లకు చెందిన పలువురు దిగ్గజ క్రికెటర్లు టీమిండియానే ఫేవరేట్గా చూస్తున్నారు.
అయితే, ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ను గెలవాలంటే ఓపెనర్ల ఆటే టీమిండియాకు ఎంతో కీలకమని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. టెస్ట్ సిరీస్లో భారం ఓపెనర్లదేనని సచిన్ స్పష్టం చేశాడు. 30 నుంచి 35 ఓవర్ల వరకు ఓపెనర్లు క్రీజులోనే ఉండే ప్రయత్నం చేయాలని అన్నాడు.
నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో ఈసారి ఎలాగైనే సరే టెస్టు సిరిస్ను గెలవాలనే పట్టుదలతో కోహ్లీసేన ఉంది. ఈ నేపథ్యంలో సచిన్ మాట్లాడుతూ ఓపెనర్లు లయ అందుకోవడం ముఖ్యమని చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియాలో ఓపెనర్లే చాలా కీలకం
"ఆస్ట్రేలియాలాంటి దేశాలకు వెళ్లినపుడు ఓపెనర్లే చాలా కీలకం. ఎందుకంటే బంతి కొత్తగా ఉంటుంది. దానికి తోడు ఫాస్ట్ బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేస్తారు. ఈ క్రమంలో సహనంతో ఆడాలి. లేకపోతే, ఆరంభంలోనే ఒకటి లేదా రెండు వికెట్లే కాదు.. ఒక్కోసారి మూడు, నాలుగు వికెట్లు కూడా చేజార్చుకునే ప్రమాదం ఉంది" అని సచిన్ అన్నాడు.

బ్యాట్స్మెన్ కూడా బాధ్యతాయుతంగా ఆడాలి
"ఓపెనర్లతో పాటు మూడో స్థానంలో బ్యాటింగ్కి వచ్చే బ్యాట్స్మెన్ కూడా బాధ్యతాయుతంగా ఆడాలి. ఒకటి నుంచి మూడు వరకు ఉన్న బ్యాట్స్మెన్ కనీసం 30 ఓవర్ల వరకు ఆడాల్సి ఉంటుంది. ఆసీస్ పిచ్లపై అది కొంచెం కష్టమని నాకు తెలుసు. కానీ, బంతి పాతబడే వరకూ ఓపికతో ఆడక తప్పదు" అని సచిన్ వెల్లడించాడు.

స్వింగ్ అయినా.. సమయం దొరుకుతుంది
"తొలి సెషన్ తర్వాత బంతి స్వింగ్కి అనుకూలించినా.. అప్పటికే బ్యాట్స్మెన్ క్రీజులో కుదురుకుని ఉంటే.. సమర్థంగా ఎదుర్కోగలడు. ఇంగ్లాండ్ పర్యటనలోనూ తొలి 40 ఓవర్లు కీలకమని చెప్పాను. ఆ తర్వాత బంతి కాస్త మెత్తబడుతుంది. ఆ సమయంలో కాస్త స్వింగ్ అయినా.. బ్యాట్స్మెన్కు సమయం దొరుకుతుంది" అని సచిన్ అన్నాడు.

ఇది కోహ్లీ సేనకు సువర్ణావకాశం
"బంతి గట్టిగా ఉన్నపుడు ఈ సమయం దొరకదు. ఆస్ట్రేలియాలో 35 ఓవర్ల తర్వాత పేస్ బౌలర్లకు అంత సహకారం లభించదు. అయితే పచ్చిక ఎక్కువగా ఉన్న పిచ్లైతే మాత్రం మరి కొన్ని ఓవర్లు బౌలర్లకే సహకరిస్తాయి. ఆసీస్ జట్టులో వార్నర్, స్మిత్ లేకపోవడం కచ్చితంగా టీమిండియాకు కలిసొచ్చేదే. ఇది కోహ్లీ సేనకు సువర్ణావకాశం" అని సచిన్ చెప్పుకొచ్చాడు. గాయం కారణంగా అడిలైడ్ టెస్టుకు యువ ఓపెనర్ పృథ్వీ షా దూరమైన నేపథ్యంలో ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మురళీ విజయ్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications