400 పరుగులు చేసినా..
'ఈ మ్యాచ్లో ఏం ఆశించాలి? టీమిండియా నుంచి ఎలాంటి ఆట చూడాలని అనుకుంటామో అది చూపించేసిందీ జట్టు. మూడో వన్డేలో కనుక ముందుగా బ్యాటింగ్ చేస్తే.. టీమిండియా 400 పరుగుల స్కోరు చేసినా నేను ఆశ్చర్యపోను. ఈ స్టేడియంలో టీ20ల్లోనే 200-225 పరుగుల స్కోర్లు నమోదవుతాయి' అని ఆకాష్ చోప్రా చెప్పాడు. ప్రస్తుతానికి టీమిండియాలో ఎలాంటి సమస్యలు లేవని అభిప్రాయపడ్డాడు. తొలి వన్డేలో భారత బౌలింగ్ బలహీనంగా ఉందని విమర్శలు వచ్చినా.. రెండో వన్డేలో పుంజుకున్న బౌలర్లు కివీస్ను 108 పరుగులకే ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే.
బ్యాటర్లకు మంచి అవకాశం..
న్యూజిల్యాండ్ జట్టు బలహీనంగా ఉందని స్పష్టం చేసిన ఆకాష్ చోప్రా.. 'ప్రత్యర్థి చాలా బలహీనమైన జట్టు. ఇక్కడి పిచ్ ఫ్లాట్గా ఉంటుంది. దానికితోడు స్టేడియం చిన్నది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు బ్యాటర్లంతా కూడా రికార్డులు మెరుగు పరుచుకోవడానికి చూడాలి. ఎందుకంటే ఎక్కడ జరిగా.. అంతర్జాతీయ మ్యాచ్ అంటే అంతర్జాతీయ మ్యాచే కదా' అని వివరించాడు. అయితే మంచు ప్రభావం కారణంగా టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకునే అవకాశాలే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు.
భారత్ ముందున్న సమస్య అదే..
డెడ్ రబ్బర్ మ్యాచ్ అంటే దీనిలో గెలిచినా, ఓడినా పెద్దగా ప్రభావం ఉండదని ఆకాష్ చోప్రా అన్నాడు. ప్రత్యర్థి జట్టు గౌరవం కాపాడుకోవడానికి ఆడుతుందని, టీమిండియా మాత్రం నాణ్యమైన ఆట ఆడేందుకు ప్రయత్నిస్తుందని చెప్పాడు. ఇలాంటి పరిస్థితిల్లో మ్యాచ్లో మరిన్ని పరుగులు నమోదవుతాయని అభిప్రాయపడ్డాడు. మైదానం చిన్నది కాబట్టి ఛేజింగ్ చేయాలని కెప్టెన్లు అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదని విశ్లేషించాడు. ప్రస్తుతానికి భారత జట్టులో ఎలాంటి లోటుపాట్లు లేవన్న ఆకాష్ చోప్రా.. చివర్లో టెయిలెండర్ల వికెట్లు తీయలేకపోవడమే భారత్ ముందున్న సమస్య అని స్పష్టం చేశాడు. శ్రీలంకతో ఆడినప్పుడు దాసున్ షనక, కివీస్ తొలి వన్డేలో బ్రేస్ వెల్ వికెట్లు తీయడంలో జట్టు విఫలం అవడాన్ని గుర్తుచేశాడు.