ఢోకా లేని పొట్టి ఫార్మాట్..
రోహిత్ కెప్టెన్ అయిన తర్వాత మళ్లీ భారత జట్టు పుంజుకుంటోంది. టీ20ల్లో వరుసగా విజయాలు సాధించింది. దీంతో నెంబర్ వన్ ర్యాంకును చేరుకుంది. టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన తర్వాత రోహిత్ ఈ ఫార్మాట్ ఆడకపోయినా.. హార్దిక్ నేతృత్వంలో కూడా భారత జట్టు వరుసగా సిరీసులు గెలుస్తూనే వస్తోంది. దీంతో టీ20ల్లో భారత్ ర్యాంకు మారలేదు. అగ్రస్థానంలోనే కొనసాగుతూ వచ్చింది. ఇక వన్డేల్లో భారత్ కొంత వెనుకంజ వేసింది. అదే సమయంలో వరుసగా సిరీసులు నెగ్గిన న్యూజిల్యాండ్ అగ్రస్థానానికి ఎగబాకింది.
అడుగు దూరంలో..
భారత్ పర్యటనకు వచ్చే ముందు న్యూజిల్యాండే వన్డేల్లో టాప్ టీం. అయితే టీమిండియా చేతిలో వరుసగా రెండు మ్యాచులు ఓడిపోవడంతో ఆ జట్టు ర్యాంకు పడిపోయింది. ఇంగ్లండ్ జట్టు అగ్రస్థానానికి చేరింది. ప్రస్తుతం మూడు జట్ల మధ్య అగ్రస్థానం కోసం పోటీ ఉంది. కివీస్పై మూడో వన్డే కూడా భారత్ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తే.. టీమిండియా వన్డేల్లో అగ్రస్థానానికి చేరుతుంది. మంగళవారం నాడు ఈ రెండు జట్లు మూడో వన్డేలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే.. ఇంగ్లండ్ను వెనక్కు నెట్టి భారత్ తొలి ర్యాంకు చేరుకుంటుంది.
ఆసీస్పై నెగ్గితే..
ఇక వచ్చే నెలలో ఆస్ట్రేలియా, భారత్ టెస్టు సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ను టీమిండియా కనీసం 2-0 తేడాతో గెలిచినా.. టెస్టు ఫార్మాట్లో కూడా భారత్ నెంబర్ వన్గా నిలుస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఈ స్థానంలో ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కనుక టీమిండియా నెగ్గితే.. ఆసీస్ జట్టు ఈ స్థానం కోల్పోతుంది. ప్రస్తుతం ఆసీస్ ఉన్న ఫామ్ చూస్తే భారత్కు కఠిన పరీక్ష తప్పదని అనిపిస్తోంది. అయితే భారత్ కూడా మంచి ఫామ్లోనే ఉంది. దానికి తోడు కీలక ఆటగాళ్లు తిరిగి ఫామ్ అందుకోవడం కూడా టీమిండియాకు కలిసొచ్చే అంశం అని మర్చిపోకూడదు. ఇలా మూడు ఫార్మాట్లలో టీమిండియా నెంబర్ వన్ ర్యాంకు సాధిస్తే చూడాలని సగటు భారత అభిమాని ఆశగా ఎదురు చూస్తున్నాడు.