హైదరాబాద్: టెస్టు సిరీస్ను పరాజయంతో ఆరంభించిన టీమిండియాపై జట్టు ఎంపిక విషయంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇలా ఓడినప్పటికీ.. సిరీస్లో పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. అయితే.. మొదటి టెస్టు ఆడిన తుది జట్టునే రెండో టెస్టులోనూ విరాట్ కోహ్లి కొనసాగిస్తేనే అది సాధ్యమవుతుందని గంగూలీ వెల్లడించాడు.
బర్మింగ్హామ్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ తొలి టెస్టులో కోహ్లీ మినహాయించి మిగిలిన బ్యాట్స్మెన్పై సర్వత్రా విమర్శ నెలకొంది. టాప్ ఆర్డర్ ప్రదర్శన పేలవంగా ఉందంటూ పెదవి విరుస్తున్నారు. అంతేకాకుండా, టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ పుజారాని తుది జట్టు నుంచి తప్పించి అతని స్థానంలో కేఎల్ రాహుల్ని ఆడించడంపై విముఖత వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై ఇప్పటికే పలు వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో.. లార్డ్స్ వేదికగా గురువారం నుంచి జరగనున్న రెండో టెస్టుకి తుది జట్టులోకి పూజారాని తీసుకుంటాడనే విధంగా అంతా భావిస్తున్నారు. కానీ.. అలా మార్చకపోవడమే మంచిదంటూ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఇంతకుముందు కూడా వన్డే సిరీస్లో తుది జట్టు ఎంపికను మాటిమాటికి మారుస్తుంటే గంగూలీ తుది జట్టు ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
'జట్టులోని ఆటగాళ్లలో కెప్టెన్ ఆత్మవిశ్వాసం నింపాలి. ఎందుకంటే.. అది అతని జట్టు.. అతను మాత్రమే వారిలో స్ఫూర్తి నింపగలడు. పరాజయం ఎదురైన తర్వాత.. ఆటగాళ్లతో కలిసి కూర్చుని.. వారితో సాంత్వనంగా మాట్లాడాలి. ఒకవేళ విరాట్ కోహ్లి అలా చేయగలిగితే.. తప్పకుండా ఆటగాళ్ల ప్రదర్శన సిరీస్లో మెరుగవుతుంది. ఇంగ్లాండ్ గడ్డపై కుదురుకునేందుకు ఆటగాళ్లకి కొంత సమయం ఇవ్వాలి. తుది జట్టులో మార్పులు చేస్తూ ఉంటే.. ఆటగాళ్లు ఆందోళనకి గురవతారు. అలా కాకుండా.. కెప్టెన్ వారికి భరోసా ఇచ్చినప్పుడు మైదానంలో స్వేచ్ఛగా ఆడగలుగుతారు' అని గంగూలీ వెల్లడించాడు.