
హైదరాబాద్: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి నిన్న మొహమ్మద్ కైఫ్, నేడు షోయబ్ మాలిక్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. జింబాబ్వేలోని హరారే క్రికెట్ క్లబ్ వేదికగా జరిగిన ముక్కోణపు సిరిస్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇంగ్లాండ్తో జరిగిన ఆఖరి టీ20లో 7 వికెట్ల తేడాతో కోహ్లీసేన విజయం సాధించి 2-1తో మూడు టీ20ల సిరిస్ను కైవసం చేసుకుంది.
దీంతో ఈ రెండు విజయాలను ప్రస్తావిస్తూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తన ట్విటర్లో ఓ ట్వీట్ పెట్టాడు. అందులో "థ్రిల్లింగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ నెగ్గింది. నిర్ణయాత్మక మ్యాచ్లో ఇంగ్లాండ్పై టీమిండియా విజయం సాధించింది. టీ20 ఫార్మాట్లో ఉపఖండం జట్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నాయి. రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. టీ20ల్లో మూడో సెంచరీ" అంటూ కొనియాడాడు.
చివర్లో చివర్లో రోహిత్ శర్మ పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పొగడటంతో పాకిస్థాన్ అభిమానులు అక్తర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్లో అక్తర్ ట్రోల్ చేస్తూ వరుసగా రీట్వీట్లు చేస్తున్నారు. "పాక్ ఆటగాడు ఫఖర్ జమాన్ కూడా ఆస్ట్రేలియాపై అద్భుతంగా రాణించాడని, బహుశా అక్తర్ ఆ మ్యాచ్ చూసి ఉండకపోవచ్చని" ఓ నెటిజన ట్వీట్ చేశాడు.
కాగా, మంగళవారం ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ విజయం సాధించిన నేపథ్యంలో మొహమ్మద్ కైఫ్ చేసిన ఓ ట్వీట్ నెటిజన్ల ఆగ్రాహానికి గురి చేసింది. 'ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాక్ జట్టు అద్భుత విజయం సాధించింది. గ్రేట్ ఇన్నింగ్స్తో పాక్ విజయానికి కారణమైన ఫఖర్ జమాన్ బిగ్ మ్యాచ్ ప్లేయర్.. శుభాకాంక్షలు" అంటూ కైఫ్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్కు స్పందించిన నెటిజన్లు 'దేశద్రోహి' అంటూ కైఫ్పై విరుచుకుపడ్డారు. 'పాకిస్తాన్ గెలిస్తే మీరు కూడా సంతోషపడతారా'... ' పాకిస్తాన్పై ఎంత ప్రేమ చూపిస్తున్నారో అయితే అక్కడే ఉండొచ్చుగా' అంటూ విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.