
హైదరాబాద్: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై అతడి భార్య హసిన్ జహాన్ ఆరోపణలు చేయడానికి 'ఫామ్ హౌజ్' కారణమని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో షమీ దంపతులకు 'హసీన్ ఫామ్ హౌజ్' ఉంది. దాని విలువ సుమారు రూ. 12 కోట్ల నుంచి 15 కోట్లు ఉంటుందని అంచనా.
అయితే, హసిన్ జహాన్ పేరుతో ఫామ్ హౌజ్ బయట బోర్డు ఉన్నప్పటికీ... ఇందుకు సంబంధించిన పత్రాల్లో ఆమె పేరు ఎక్కడా లేదని తెలియడంతోనే ఈ వివాదం మొదలైనట్లు సమాచారం. కాగా, భవిష్యత్తులో ఇక్కడే షమీ క్రికెట్ అకాడమీ నిర్మించాలనుకున్నాడని తెలుస్తోంది. ఈ ఫామ్ హౌజ్పై భార్యాభర్తల మధ్య గొడవలు మొదలైనట్లు సమాచారం.
ఈ ఫామ్ హౌజ్ వ్యవహారంపై హసిన్ జహాన్ తండ్రి సైతం స్పందించాడు. ఈ ఫామ్ హౌజ్ విషయంపై గురించి తనకు ఏమాత్రం తెలియదని అన్నారు. షమీ, హసీన్లకే అసలు నిజం తెలుసని అన్నారు. మహ్మద్ షమీ ఎలాంటివాడని ప్రశ్నించగా అతడు ఒకప్పుడు మంచివాడేనని సమాధానమిచ్చారు.
ఇక, తన కూతురు చిన్ననాటి నుంచే ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఉండేదని, స్వశక్తితో ఎదగాలని ఆకాంక్షించేదని చెప్పారు. షమీని హసిన్ జహాన్ రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మాజీ భర్తతో ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది.
షమీ వివాదంపై హసిన్ జహాన్ మాజీ భర్త షేక్ సైఫుద్దీన్ జీ 24 గంటా ఛానెల్తో మాట్లాడుతూ ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుని ఇద్దరూ కలిసిపోతే బాగుంటుందని సూచించడం విశేషం. తాజా వివాదంపై హసిన్ జహాన్ పిల్లలు కూడా స్పందించారు. హసిన్ పెద్ద కుమార్తె మాట్లాడుతూ తన తల్లి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని, సెలవుల్లో తన తల్లిని కలుస్తామని వారు తెలిపారు.
తన భర్త చాలా మంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపణలు చేయడంతో పాటు అతని కుటుంబ సభ్యులపై వేధింపులు, గృహహింసకు పాల్పడుతున్నారని కోల్కతా పోలీసులకు షమీ భార్య ఫిర్యాదు చేయడంతో షమీతో పాటు అతడి కుటుంబ సభ్యులు, మరో నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి.
హసిన్ జహాన్ ఫిర్యాదుతో షమీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టు నుంచి షమీని తప్పించిన సంగతి తెలిసిందే.