

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితంలో మరిచిపోలేని రోజు ఏప్రిల్ 2. ధోని జీవితంలో ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ధోని నాయకత్వంలోని టీమిండియా 2011లో ఇదే రోజున భారత అభిమానులుక రెండో వన్డే వరల్డ్ కప్ని అందించింది.
వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా వాంఖడె స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. రెండోది ఏరోజైతే ధోని వరల్డ్ కప్ నెగ్గాడో అదే రోజుని ధోనిని పద్మభూషణ్ అవార్డు వరించింది. ధోనితో పాటు బిలియర్డ్స్ ఛాంపియన్ పంకజ్ అద్వానీని కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించనుంది.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ధోని పద్మభూషణ్ అవార్డు అందుకోనున్నాడు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో ధోనితో పాటు పంకజ్ అద్వానీ కూడా పద్మ భూషణ్ అందుకునే క్రీడాకారుల జాబితాలో ఉన్నాడు. అయితే సరిగ్గా ఏడేళ్ల కిందట ఇదే రోజున టీమిండియాకు ధోని వరల్డ్కప్ అందించడం విశేషం.
భారత క్రికెట్కు ధోని చేసిన సేవలకు గాను ఇంతకముందే భారత ప్రభుత్వం పద్మ శ్రీతో సత్కరించింది. ఇప్పుడు దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్తో సత్కరించనుంది. ఆదివారం పద్మ అవార్డులను గెలుచుకున్న 41 మందికి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ విందు ఇచ్చారు.
సోమవారం జరిగే పద్మ అవార్డుల కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఈ ఏడాది 84 మందిని పద్మఅవార్డులు వరించాయి. ఇందులో ముగ్గురికి పద్మవిభూషణ్, తొమ్మిది మందిని పద్మభూషణ్, 72 మందిని పద్మశ్రీ అవార్డులతో సత్కరించనున్నారు.
ఏప్రిల్ 2, 2011న వరల్డ్ కప్ గెలిచిన ధోని:
సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం 2011లో ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే మైదానంలో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని టీమిండియా రెండోసారి వన్డే వరల్డ్ కప్ టోర్నీని కైవసం చేసుకుంది. వాంఖడే మైదానంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు మహేల జయవర్ధనే (103 నాటౌట్: 88 బంతుల్లో 13 ఫోర్లు) రాణించడంతో నిర్ణతీ 50 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. అనంతరం 275 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది.
ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను మలింగ డకౌట్గా పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ (18) పరుగుల వ్కక్తిగత స్కోరు వద్ద మలింగ బౌలింగ్లో వికెట్ కీపర్ కుమార సంగక్కరకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన గౌతం గంభీర్ (97: 122 బంతుల్లో 9 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. తన అద్భుతమైన ఇన్నింగ్స్తో భారత్ను ఆదుకున్నాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ (35) పరుగుల వద్ద దిల్షాన్ బౌలింగ్లో కాట్ అండ్ బౌల్డ్గా పెవిలియన్కు చేరాడు.
కోహ్లీ ఔటైన తర్వాత యువరాజ్ సింగ్ క్రీజులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ధోని బరిలోకి దిగాడు. గంభీర్తో కలిసి ధోనీ దూకుడు మొదలుపెట్టాడు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో గంభీర్ (97) పరుగుల వద్ద పెరీరా బౌలింగ్లో ఔటయ్యాడు. గంభీర్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ (21 నాటౌట్) సహకారంతో ధోని (91 నాటౌట్: 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) వీర విహారం చేశాడు. దీంతో భారత్ విజయానికి నాలుగు పరుగులు కావాల్సి ఉంది.
స్టేడియంలో అభిమానుల కేరింతలు, సందడి మధ్య 49వ ఓవర్ మొదలైంది. తొలి బంతిని ఎదుర్కొన్న యువరాజ్ సింగ్ సింగిల్ తీసి ధోనీకి స్ట్రైకింగ్ ఇచ్చాడు. కులశేఖర వేసిన రెండో బంతిని ఎదుర్కొన్న ధోని దానిని భారీ సిక్సర్గా మలిచి భారత్కు వరల్డ్ కప్ అందించాడు. ఆ సిక్సర్ మాత్రం భారతీయుల గుండెల్లో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. దీంతో రెండోసారి వరల్డ్ కప్ గెలవాలన్న భారత అభిమానుల 28 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.