టీమిండియాకు ఆడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఎంతో ట్యాలెంట్ ఉన్నా కూడా చాలా మంది ఆటగాళ్లకు భారత జెర్సీ ధరించే అవకాశమే రాదు. కానీ కొందరు యువ ఆటగాళ్లు మాత్రం తమకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో దారుణంగా విఫలం అవుతున్నారు. ముఖ్యంగా ఆటకు కావలసిన ఫిట్నెస్ స్థాయిలు మెయింటైన్ చేయడంలో వాళ్లు ఫెయిల్ అవుతున్నారు.
ఇదే కేటగిరిలో చేరాడు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. తనకు చాలా కాలంగా మణికట్టు నొప్పి ఉంది. విజయ్ హజారే ట్రోఫీ సహా దేశవాళీల్లో రాణించిన అతనికి భారత జట్టులో చోటు దక్కింది. కానీ మణికట్టు నొప్పితో అతను న్యూజిల్యాండ్తో జరిగే టీ20 సిరీస్కు దూరమైనట్లు సమాచారం. హైదరాబాద్, మహారాష్ట్ర మధ్య రంజీ మ్యాచ్ సందర్భంగా పలుమార్లు మణికట్టు నొప్పిగా ఉందన్న రుతురాజ్.. చికిత్స కోసం ఎన్సీయేకు వెళ్లిపోయాడు.
అంతకుముందు సౌతాఫ్రికాతో సిరీస్కు కూడా ఇదే గాయం కారణంగా అతను దూరమయ్యాడు. దీంతో టీమిండియా సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దలు అతనిపై అసహనంగా ఉన్నారట. ఆటకు కావలసిన ఫిట్ నెస్ను రుతురాజ్ మెయింటైన్ చేయడంలో ఫెయిలవడం వాళ్లకు ఏమాత్రం నచ్చలేదని తెలుస్తోంది. అయితే ఇప్పటికే జట్టులో ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, పృథ్వీ షా ఉండటంతో రుతురాజ్ స్థానంలో మరొక ఓపెనర్ను ఎంపిక చేయడం జరగదని నిపుణుల అంచనా.
వన్డేల్లో సూపర్ ఫామ్లో ఉన్న గిల్కే ఓపెనింగ్ బాధ్యతలు ఇస్తారా? లేక ఇషాన్ కిషన్కు జట్టులో అవకాశం ఇస్తారా? అనేది చూడాలి. అదే సమయంలో కీపర్గా ఇషాన్ కిషన్ ఆడితే.. జట్టుకు ధనా ధన్ ఓపెనింగ్ ఇవ్వడం కోసం పృథ్వీ షాను ఆడిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే కిషన్, గిల్ ఇద్దరే తొలి టీ20లో ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా కొందరు అంటున్నారు.