
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా సూపర్ ఓవర్లో విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకుంది. అయితే ఆ సూపర్ ఓవర్లో టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా 17 పరుగులు ఇచ్చాడు. ఆ ఓవర్లో కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్టిల్లు ధాటిగా ఆడి భారత్కు 18 పరుగుల టార్గెట్ను నిర్దేశించారు. ఛేదనలో రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్లు విరుచుకుపడడంతో భారత్ చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా రోహిత్ వరుస రెండు సిక్సులు బాది విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సూపర్ ఓవర్లో బుమ్రా 17 పరుగులు ఇవ్వడంతో అతనికి భారత కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఓ ఉచిత సలహా ఇచ్చాడు. 'బుమ్రా సూపర్ ఓవర్ను చూశాను. అతడో అద్భుతమైన బౌలర్. కానీ.. క్రీజుని మరింత ఉపయోగించుకుని వివిధ కోణాల్లో వైవిధ్యమైన బంతుల్ని వేయాలి' అని సంజయ్ ఓ ట్వీట్ ద్వారా సలహా ఇచ్చాడు. ఇది నెటజన్లకు మరొకసారి ఆగ్రహం తెప్పించింది.
ఇప్పటికే అనేకసార్లు నెటిజన్ల విమర్శల బారిన పడ్డ మంజ్రేకర్ను మళ్లీ దుమ్మెత్తిపోశారు. 'సాధారణ ప్లేయర్ అయిన నువ్వు.. ప్రపంచ నంబర్ వన్ బౌలర్ బుమ్రాకే సలహా ఇస్తున్నావా?' అంటూ మండిపడుతున్నారు. 'నాలుగో టీ20లో బుమ్రాకి బదులుగా టీమిండియాలో సంజయ్కు చోటు ఇవ్వండి', '2019లోనే అనుకుంటే 2020లో మొదలుపెట్టావా? అందర్నీ విమర్శించడమే నీ లక్ష్యమా?' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయిదు టీ20ల సిరీస్లో భారత్ 3-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. వెల్లింగ్టన్ వేదికగా నాలుగో మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్కు 166 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. మనీష్ పాండే (50 నాటౌట్; 36 బంతుల్లో 3 ఫోర్లు) మెరవగా.. కేఎల్ రాహుల్(39; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), శార్దూల్ ఠాకూర్ (20;15 బంతుల్లో 2 ఫోర్లు)లు ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో ఇష్ సోధీ మూడు వికెట్లు సాధించగా.. బెన్నెట్ రెండు వికెట్లు తీశాడు.