లండన్: విదేశాల్లో రాణించాలంటే తగినన్ని ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడటమే సరైన నిర్ణయమని టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా శనివారం ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. సిరీస్లో నిలవాలంటే ఖచ్చితంగా నెగ్గి తీరాల్సిన మ్యాచ్లో విరాట్ కొహ్లీ సేన ఇంగ్లండ్కు సవాల్ విసురుతోంది.
వరుస విజయాలతో ఇంగ్లీష్ టీమ్ జోరు మీదుండగా.. వరుస ఓటములతో టీమిండియా ఒత్తిడిలో ఉంది. దీంతో నాటింగ్హామ్లోని ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరుగనున్న టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్పై బదులు తీర్చుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.
"విదేశీ గడ్డపై రాణించాలంటే వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాలి. స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రాక్టీస్ మ్యాచ్లే మనకు బాగా సహకరిస్తాయి. ఒక్కోసారి సిరీస్ ప్రారంభానికి ముందు తగినంత సమయం ఉండకపోవచ్చు. కానీ, ఆ ఉన్న సమయంలోనే ఆటగాళ్లు ప్రాక్టీస్లో పాల్గొనడం ఉత్తమం" అని అన్నాడు.
"ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ముంబై ఎక్కడైనా సరే. మ్యాచ్లకు మధ్యలో తుది జట్టులో మార్పులు సరికాదు. ఏవైనా మార్పులు చేయాలంటే తొలి మ్యాచ్కు ముందే చేసుకోవాలి. అంతేకానీ మధ్యలో చేస్తే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రతి బ్యాట్స్మెన్కి తన బలం, బలహీనత ఏమిటో తెలుసు" అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
"ఎక్కడ బలంగా లేమో తెలుసుకుని అక్కడ మెరుగయ్యేలా చేసుకోవాలి. మిగిలిన దేశాల బౌలర్లతో పోల్చుకుంటే ఇంగ్లాండ్ బౌలర్లు బంతిని ఎక్కువగా స్వింగ్ చేయగలరు. కాబట్టి, మన బ్యాట్స్మెన్లు వారిని ఎదుర్కొనే దానిపై దృష్టి పెట్టాలి" అని రోహిత్ శర్మ అన్నాడు. ఇప్పటి వరకూ 25 టెస్టులాడిన రోహిత్ శర్మ టెస్టుల్లో స్థిరమైన స్థానం దక్కించుకోలేకపోయాడు.