రోహిత్ శర్మతో కలిసి స్ట్రైక్ని రొటేట్ చేస్తూ
మ్యాచ్కు అనుగుణంగా రోహిత్ శర్మతో కలిసి స్ట్రైక్ని రొటేట్ చేస్తూ రాయుడు(100: 81 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీ సాధించాడు. రాయుడి సెంచరీకి జట్టు మేనేజ్మెంట్ సైతం ఫిదా అయింది. ఈ సెంచరీతో అంబటి రాయుడు 2019 వన్డే వరల్డ్కప్కు మిడిలార్డర్ బ్యాట్స్మెన్గా టీమిండియాలో దాదాపు చోటు ఖాయం చేసుకున్నాడు.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ సైతం
మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. కోహ్లీ మాట్లాడుతూ "అవకాశాన్ని రాయుడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 2019 ప్రపంచకప్ వరకు మేం అతడికి మద్దతుగా నిలవాల్సి ఉంది. ఆటను సరిగ్గా అర్థం చేసుకుంటూ రాయుడు ముందుకు సాగుతున్నాడు. ఎట్టకేలకు ఓ తెలివైన ఆటగాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని అన్నాడు.
రోహిత్ శర్మ బాహాటంగానే
మరోవైపు నాలుగో స్థానానికి తాను తగిన ఆటగాడిననే విషయంలో ఉన్న సందేహాలను రాయుడు తన సెంచరీతో తీర్చేశాడని రోహిత్ శర్మ అన్నాడు. ‘‘రాయుడు చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో స్థానానికి సంబంధించి అన్ని సమస్యలనూ అతడు పరిష్కరించాడు. ఇక ప్రపంచకప్ వరకు నంబర్-4పై చర్చ ఉండదని అనుకుంటున్నా. రాయుడు గొప్పగా బ్యాటింగ్ చేశాడు. భారీ భాగస్వామ్యం అవసరైన సమయంలో అతడు నిలబడ్డాడు. సత్తా చాటుకున్నాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడ్డాక... ఒత్తిడిలో అతడు చక్కగా బ్యాటింగ్ చేశాడు. స్వేచ్ఛగా ఆడాడు. మాకు చాలా రోజులుగా రాయుడు తెలుసు. అతడి ప్రతిభ గురించీ తెలుసు" అని రోహిత్ శర్మ బాహాటంగానే ప్రకటించేశాడు.
ఎంతో మందిని నెం.4 స్థానం కోసం
నిజానికి టీమిండియా గత మూడునాలుగేళ్లలో నెం.4 స్థానం కోసం దాదాపు 9 మంది ఆటగాళ్లని పరీక్షించింది. ఈ క్రమంలో సీనియర్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, అజింక్య రహానె, దినేశ్ కార్తీక్లకి అవకాశమిచ్చింది. అయితే, వారు నిలకడగా ఆ స్థానంలో రాణించలేకపోయారు. దీంతో యువ క్రికెటర్లు మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్, కేఎల్ రాహుల్లకు అవకాశాలిచ్చింది. వీరంతా విఫలం కావడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అయితే, ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అంబటి రాయుడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
బ్రబౌర్న్ స్టేడియంలో చేసిన సెంచరీ
దీంతో ఇంగ్లాండ్ పర్యటనకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయడం... ఆ తర్వాత యో-యో ఫిట్నెస్ టెస్టులో ఫెయిల్ అవడంతో ఇంగ్లాండ్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత రాయుడు యో-యో టెస్టులో పాసవడంతో తిరిగి మళ్లీ ఆసియా కప్లో చోటు దక్కించుకోవడంతో పాటు అద్భుత ప్రదర్శన చేశాడు. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇక, ప్రస్తుతం జరుగుతున్న సిరిస్లో గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో 22, వైజాగ్ వన్డేలో 73, పుణె వన్డేలో 22 తాజాగా ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన వన్డేలో సెంచరీ నమోదు చేశాడు.
2019 వన్డే వరల్డ్కప్లో రాయుడు చోటు
ఈ సెంచరీతో అంబటి రాయుడు 2019 వన్డే వరల్డ్కప్కు మిడిలార్డర్ బ్యాట్స్మెన్గా టీమిండియాలో దాదాపు చోటు ఖాయం చేసుకున్నాడు. అంతేకాదు 2017 జనవరి తర్వాత భారత్ జట్టు తరఫున వన్డేల్లో నెం.4 స్థానంలో ఆడి ఒక బ్యాట్స్మెన్ సెంచరీ సాధించడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం.