బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఓటమి ఖాయమనుకుంటున్న సమయంలో రోహిత్ శర్మ మైదానంలోకి వచ్చాడు. ఫీల్డింగ్ సమయంలో అతని బొటనవేలికి గాయమైంది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లి కట్టు కట్టించింది టీం మేనేజ్మెంట్. ఈ క్రమంలోనే అత్యవసరం అయితే తప్ప అతన్ని బరిలో దింపకూడదని అనుకున్నారు. కానీ భారత జట్టు ఓటమి అంచున నిలవడంతో రోహిత్ రాక తప్పలేదు.
ఈ క్రమంలోనే 8వ స్థానంలో క్రీజులోకి వచ్చిన రోహిత్.. జట్టును గెలిపించేందుకు ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 28 బంతుల్లోనే 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. చివరకు ఐదు పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ గెలిపించేందుకు రోహత్ పడిన కష్టం అభిమానులను ఫిదా చేసింది. అతన్ని హీరో అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
ఇలా వేలికి కట్టు కట్టుకొని మరీ అద్భుతంగా బౌలింగ్ చేసిన రోహిత్ పోరాటాన్ని అతని భార్య రితిక కూడా కొనియాడింది. సోషల్ మీడియాలో భర్తను మెచ్చుకుంటూ ఆమె పెట్టిన పోస్టు వైరల్ అయింది. 'ఐ లవ్ యూ, నువ్వు ఇలా ఉండటం చూసి ఎంతో గర్విస్తున్నా. అలాంటి పరిస్థితుల్లో వెళ్లి అలా ఆడటం మాటలు కాదు' అని ఆమె పోస్టు చేసింది. ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రోహిత్ అభిమానులందరూ అతని పోరాటానికి ఫిదా అయిపోయారు.
మ్యాచ్ అనంతరం తన గాయం గురించి మాట్లాడిన రోహిత్.. 'ఈ గాయం అంత పెద్దది కాదు. జస్ట్ ఎముక పక్కకు జరిగింది. కొన్ని కుట్లు పడ్డాయంతే. అదృష్టవశాత్తూ ఎముక విరగలేదు. అందుకే బ్యాటింగ్ చేయగలిగా' అని చెప్పాడు. అయితే మూడో వన్డేకు మాత్రం అతను అందుబాటులో ఉండడని, టెస్టు సిరీస్ గురించి అప్పుడే ఏం చెప్పలేమని టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు.