టాప్ పెర్ఫామెన్స్
తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 48 పరుగులిచ్చిన అతను ఒక వికెట్ తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో 53 పరుగులే ఇచ్చి 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో తమిళనాడు జట్టు రెండో ఇన్నింగ్స్లో కేవలం 133 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్ అనంతరం బెస్ట్ పెర్ఫామెన్స్తో తనకు దక్కిన బంతి ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నీడీ సౌరాష్ట్ర సారధి. 'ఈ సీజన్లో తొలి చెర్రీ' అని దానికి క్యాప్షన్ ఇచ్చాడు.
నేను రెడీ..
ఆస్ట్రేలియా సిరీస్కు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని జడేజా వెల్లడించాడు. ఆసీస్తో తొలి రెండు టెస్టులు ఆడే జట్టును బీసీసీఐ కొన్నిరోజుల క్రితం ప్రకటించింది. ఈ జట్టులో జడేజా ఉన్నప్పటికీ అతను ఆడేదీ, లేనిదీ ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తాను ఈ సిరీస్కు రెడీ అని జడ్డూ తెలిపాడు. 'నేషనల్ క్రికెట్ అకాడమీలో 20 రోజుల పాటు బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ ఉన్నా. కానీ మ్యాచ్ పరిస్థితులు వేరే ఉంటాయి. ఆస్ట్రేలియా సిరీస్ ముందు ఒక మ్యాచ్ ఆడాలని అనుకున్నా. అందుకే ఇక్కడ ఉన్నా. మొదటి టెస్టు నాటికి పూర్తి ఫిట్గా ఉంటా' అని ధీమా వ్యక్తం చేశాడు.
ఐదు నెలల గ్యాప్..
గతేడాది ఆసియా కప్ సమయంలో జడేజా మోకాలి గాయంతో జట్టుకు దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ కూడా ఆడలేకపోయాడు. దీనిపై మాట్లాడిన అతను.. 'ఐదు నెలల గ్యాప్ తర్వాత కాంపిటీటివ్ గేమ్ ఆడితే మనలో కాన్ఫిడెన్స్ అంతగొప్పగా ఉండదు. కానీ ముందుకు వెళ్లేకొద్దీ మనం మెరుగవుతాం. ఈ ఆటలో గాయాలు కూడా భాగమే. కానీ గాయమైతే మాత్రం మళ్లీ సున్నా నుంచి మొదలు పెట్టాలి. ఇంత గ్యాప్ రావడంతో నేను ఫిట్నెస్ సాధించాల్సి వచ్చింది. కాన్ఫిడెన్స్ వస్తే రోజురోజుకూ నా ఆట మెరుగవుతుంది' అని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా సిరీస్లో టీమిండియాకు జడేజా చాలా కీలకం అన్న సంగతి తెలిసిందే.